హిమపాతంలో చిక్కుకున్న ప్రజలు ఎలా బయటపడాలనే దానిపై జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది సైన్యం. ఈ ప్రదర్శనలో మంచులో కూరుకుపోయినప్పుడు స్థానికులు చేయాల్సిన కసరత్తులను ప్రత్యక్ష్యంగా చేసి చూపించారు. భారీగా హిమపాతం కురిసిన వేళ పాటించాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్థులు ఎలాంటి వైద్య సహాయం పొందాలి అనే దానిపై చర్చించారు. తీగలు, పారలు ఏ విధంగా ఉపయోగించాలో చూపించారు.
"పీర్ పంజల్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో మంచు కురుస్తుంటుంది. అక్కడ భూభాగం కూడా అంత అనుకూలంగా ఉండదు. శీతాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాం."