తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2021, 2:04 PM IST

ETV Bharat / bharat

చైనాతో 'గస్తీ'మే సవాల్‌కు సిద్ధమైన భారత్!

లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనాతో ప్రతిష్టంభన ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కన్పించట్లేదు. సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగానే తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుతో పాటు ఇతర నదీజలాలపై గస్తీని పెంచేందుకు అత్యాధునిక నిఘా పడవలను రంగంలోకి దించనుంది.

surveillance of pangong lake
చైనాతో 'గస్తీ'మే సవాల్‌కు సిద్ధమైన భారత్!

లద్దాఖ్​ సరిహద్దులో నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు భారత్​ సిద్ధమైంది. ఈ మేరకు 12 నిఘా ఓడల కోసం ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు భారత సైన్యం వెల్లడించింది. పాంగాంగ్‌ సరస్సు సహా ఎత్తయిన పర్వత శ్రేణుల్లో ఉండే అత్యంత క్లిష్టమైన నదీ జల్లాల్లో గస్తీ కాయడం కోసం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు ఆర్మీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొత్తం 12 గస్తీ‌ బోట్ల కోసం ఈ ఒప్పందం చేసుకోగా.. ఈ ఏడాది మే నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. సైన్యం అవసరాలకు తగ్గట్లు ఈ ఓడల్లో ప్రత్యేక ఉపకరణాలను అమర్చనున్నట్లు గోవా షిప్‌యార్డ్‌ సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా అత్యాధునిక నిఘా ఓడలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలిపింది.

ఎనిమిది సార్లు చర్చలు జరిగినప్పటికీ..

గతేడాది మేలో పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణతో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. దీంతో చైనా చర్యలకు వేగంగా స్పందించేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. తూర్పు లద్ధాఖ్‌, పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 వేల మంది ఆర్మీ సిబ్బంది పహారా కాస్తున్నారు. అటు చైనా బలగాలు కూడా సరిహద్దుల్లో భారీగానే మోహరించాయి. ప్రతిష్టంభన తొలగించేందుకు ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య ఎనిమిది సార్లు సైనిక స్థాయి చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

పాంగాంగ్‌ వద్ద వివాదం ఇదీ..

పాంగాంగ్‌ సరస్సు లద్దాఖ్‌లో ఉంది. దాదాపు 134 కిలోమీటర్ల పొడవున్న ఈ సరస్సు టిబెట్‌ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సరస్సు దాదాపు 60 శాతం టిబెట్‌ పరిధిలో ఉంటుంది. 1962లో చైనా దాడి చేసి ఆక్సాయిచిన్‌ను దక్కించుకొంది. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దులుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ ఈ సరస్సు మీద నుంచి పోతుంది. ఇరు దేశాలు కచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ధరించుకోలేదు. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు 'ఫింగర్స్‌'గా అభివర్ణిస్తాయి. ఈ ఫింగర్స్​ దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి.

భారత్‌ 'ఫింగర్‌ 8' నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతోంది. భౌతికంగా మాత్రం ఫింగర్‌ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యానికి ఫింగర్‌ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది. అయినా ఫింగర్‌ 2 వరకు తమదే అని వాదిస్తోంది. ప్రస్తుతం భారత్‌ సైన్యాన్ని ఫింగర్‌2 వద్దే ఆపేస్తోంది. సరస్సులో కూడా భారత్‌ చైనాల మధ్య వివాదం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సరస్సులో భారత దళాలు గస్తీ నిర్వహిస్తుంటే చైనా దళాలు మరబోట్లు వేసుకొని వచ్చి అడ్డుకొన్నాయి. దీంతో భారత్‌ కూడా టాంపా రకం బోట్లను ఇక్కడ వినియోగించడం మొదలుపెట్టింది. ఇటీవల పాంగాంగ్‌ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య వివాదం చోటు జరగగా.. చైనా ఎల్‌ఎక్స్‌ రకం బోట్లను తీసుకొచ్చింది. దీంతో భారత్‌ కూడా తమ నిఘా బోట్లను నిలిపింది.

ప్రస్తుతం ఈ వివాదం ఇంకా తొలగకపోవడం వల్ల నదీజలాల్లో పహారాను మరింత పటిష్ఠం చేసుకునేందుకు భారత్‌ సన్నహాలు చేపట్టింది. ఇందులో భాగంగానే మరిన్ని పెట్రోలింగ్‌ బోట్లను రంగంలోకి దించనుంది.

ఇదీ చూడండి:కమ్ముకొస్తున్న డ్రాగన్​- భారత్​ పరిస్థితి ఏంటి?

ABOUT THE AUTHOR

...view details