తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ రక్షణలోనే కాదు.. ప్రాణాలు పోయడంలోనూ హీరోలే! - Army carries pregnant woman in waist-deep snow; she later gives birth at Baramulla hospital

జమ్ముకశ్మీర్​లో ఆర్మీ సిబ్బంది మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. పురుటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను చికిత్స కోసం దట్టమైన మంచులో 100 మంది సైనికులు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రి వరకు మోసుకెళ్లారు. ఆర్మీ సిబ్బంది చేసిన పనిని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Army carries pregnant woman in waist-deep snow; she later gives birth at Baramulla hospital
దట్టమైన మంచులో గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన జవాన్లు

By

Published : Jan 15, 2020, 10:35 PM IST

జమ్ముకశ్మీర్​లో పురుటినొప్పులతో అవస్థలు పడుతున్న ఓ మహిళను ఖరియత్ బృందానికి చెందిన ఆర్మీ సిబ్బంది రక్షించారు. భారీగా మంచు పేరుకుపోయిన దారిలో 5 కిలోమీటర్ల మేర గర్భిణిని భుజాలపై మోసుకెళ్లి ఆస్పత్రికి చేర్చి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.

గర్భిణిని భుజాలపై మోసుకెళ్తున్న జవాన్లు

సవాళ్లకు ఎదురొడ్డి..

దక్షిణ కశ్మీర్ బారాముల్లాలోని దార్ద్​పొరా గ్రామానికి చెందిన షామిమా.. పురుటినొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం అందగానే వెంటనే స్పందించింది ఖరియత్​ బృందం. అయితే.. మహిళను ఆస్పత్రికి చేర్చేందుకు జవాన్లకు అడుగడుగున సవాళ్లు ఎదురయ్యాయి. కఠిన పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది... అప్పటికప్పుడు మూడు బృందాలుగా విడిపోయారు. గర్భిణిని తీసుకురావడానికి ఒక బృందం.. మంచు తొలగించే పనిలో ఉండగా... హెలికాఫ్టర్ దిగడానికి అనువుగా హెలిప్యాడ్​ని సిద్ధం చేశారు మరో బృందం సభ్యులు. చివరగా ఆ ప్రాంతం నుంచి కనిస్పొరా ప్రాంతం వరకు రోడ్డు మార్గంలో ఉన్న మంచును తొలగించి అంబులెన్సుకు దారిచ్చింది మూడో బృందం.

ఆరు గంటలు.. 100 మంది సిబ్బంది

దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్​లో 100 మంది ఆర్మీ సిబ్బంది, 25 మంది స్థానికులు భాగస్వాములయ్యారు. మార్గమధ్యలో ఉప్నోలా ప్రాంతం వద్ద గర్భిణి పరిస్థితి కాస్త కుదుటపడటం వల్ల ఆమెను ఆర్మీ అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన షామిమా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

"బహుముఖ వ్యూహాలతో గర్భిణిని రక్షించడానికి ఆర్మీ అధికారులు, సిబ్బంది విజయవంతంగా ప్రయత్నించారు. వారి అద్భుతమైన సమయస్ఫూర్తికి ఇదో నిదర్శనం."
- లెఫ్టినెంట్ జనరల్ కన్వాల్ జీత్ సింగ్ ధిల్లాన్.

ఏమిటీ ఖరియత్​ బృందం?

విపత్కర పరిస్థితుల్లో స్థానికులకు సాయం చేసేందుకు 'ఖరియత్' సహాయక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సహాయం కోసం సంప్రదించడానికి ఆర్మీ క్యాంప్​ ఫోన్​ నంబర్లను స్థానిక ప్రజలకు అందించారు.

కొనియాడిన మోదీ

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉంటూ సైనికులు చూపే తెగువ, సేవానీరతి ఎనలేనిదని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్మీ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన మోదీ... జవాన్లు గర్భిణిని మోసుకెళ్తున్న వీడియోను షేర్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details