తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2020, 9:00 PM IST

Updated : Jul 15, 2020, 10:00 PM IST

ETV Bharat / bharat

ఆయుధాల కొనుగోలులో సైన్యానికి మరింత స్వేచ్ఛ

అత్యవసర ఆయుధాల కొనుగోళ్లు చేపట్టేందుకు త్రివిధ దళాలకు రక్షణ శాఖ అనుమతించింది. కొనుగోళ్లలో జాప్యం నివారించేలా రూ. 300 కోట్ల వరకు ఆయుధాలు సేకరించే విధంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఈ నెల 17న లద్దాఖ్​ పర్యటన చేపట్టనున్నారు. సరిహద్దులో దళాల మోహరింపుపై సమీక్ష నిర్వహించనున్నారు.

Armed forces get special powers for individual procurement worth Rs 300 cr
మూలధన సమీకరణ కోసం భద్రతా దళాలకు అధికారాలు

వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యంతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర అవసరాలు తీర్చే విధంగా రూ. 300 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లు చేపట్టేందుకు త్రివిధ దళాలకు అధికారం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పరిమితి మేరకు ఇకపై కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలుస్తోంది!

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రూ.300 కోట్ల వరకు ఎన్నైనా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని తెలిపింది. ఆయుధాల కొనుగోళ్లకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. ఉత్తర సరిహద్దులో తాజా పరిస్థితుల నేపథ్యంలో సాయుధ దళాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని డీఏసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపింది.

'అత్యవసర పనుల నిమిత్తం ఆయుధాలు కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి డీఏసీ బదిలీ చేసింది. పెట్టుబడి కోసం రూ.300 కోట్లు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఆయుధాల దిగుమతి కాలం ఏడాది కంటే తగ్గుతుంది' అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.

రాజ్​నాథ్ లేహ్ పర్యటన

మరోవైపు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తూర్పు లద్దాఖ్​లో పర్యటించనున్నారు. సరిహద్దులో మోహరించిన సైనికులతో సంభాషించి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించనున్నారు.

రాజ్​నాథ్​ సింగ్​ జులై 17న దిల్లీ నుంచి నేరుగా లేహ్​కు బయలుదేరనున్నట్లు అధికారులు వెల్లడించారు. గల్వాన్ ఘర్షణలో గాయపడిన సైనికులను పరామర్శించనున్నట్లు తెలిపారు. భద్రతా దళాలు మోహరించిన ఫార్వర్డ్ ప్రదేశాలను రాజ్​నాథ్ సందర్శించనున్నారు. రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె సైతం లేహ్​ పర్యటనలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి-బ్యాంక్​ చోరీ- రూ.10లక్షలు కొట్టేసిన పదేళ్ల బాలుడు

Last Updated : Jul 15, 2020, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details