ప్రపంచం చల్లగుండాలని.. సినీ కళాకారుడి సైకిల్ యాత్ర ప్రపంచ శాంతి కోసం 20 వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ దేశమంతా చుట్టొచ్చాడు ఓ సినీ కళాకారుడు. కర్ణాటక హసన్కు చెందిన కన్నడ నటుడు నాగ్రాజ్ గౌడ 2017 డిసెంబర్ 3వ తేదీ నుంచి జాతీయ ఐక్యత, ప్రపంచ శాంతి, టెర్రరిజం, పర్యావరణం వంటి సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే పని పెట్టుకున్నాడు. అందుకు యాత్రనే మార్గంగా ఎన్నుకున్నాడు. అంతే కాదు, నీటి పొదుపు, గోసంరక్షణ, పచ్చదనాన్ని కాపాడుకోవాలనీ ప్రచారం చేశాడు నాగ్రాజ్. 48 ఏళ్ల వయసులో ఏదోలా సమాజ సేవ చేయాలని యాత్ర ప్రారంభించాడు నాగ్రాజ్. దాతలిచ్చిన విరాళాలతో మార్చిలో ఈ యాత్ర మొదటి దఫాను పూర్తి చేసి మూడు నెలల విశ్రాంతి తరువాత రెండో దశ యాత్ర ప్రారంభిస్తాను అంటున్నాడు నాగ్రాజ్.
భోజనం, నిద్ర అక్కడే..
సైకిల్పై కొన్ని జతల దుస్తులు, ఓ చాప, ఓ దుప్పటి పట్టుకెళ్లాడీ నటుడు. గుళ్లు, మసీదు, గురుద్వారాల్లో భోజనం చేసి అక్కడే నిద్రపోయి తిరిగి ఉదయాన్నే తన యాత్ర సాగిస్తాడు. వెళ్లిన ప్రతి చోటా తన పనికి మెచ్చి అందరూ ఎంతో కొంత సాయం చేశారని చెప్పుకొచ్చాడు నాగ్రాజ్.
ప్రముఖులను కలిసి..
ఈ యాత్రలో భాగంగా వెళ్లిన ప్రతి చోటా ప్రముఖులను కలిసి ప్రపంచ శాంతి గురించి బోధ చేస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్, షీలా దీక్షిత్, సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్ యాదవ్, కమల్నాథ్, కల్యాణ్ సింగ్, మనోజ్ తివారీ వంటి ప్రముఖ రాజకీయ నాయకులనూ కలిశాడు నాగ్రాజ్.
ఇదీ చదవండి:రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు