తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2021, 5:07 PM IST

ETV Bharat / bharat

ట్రాక్టర్​ ర్యాలీలో హింసపై షా సమీక్ష

దిల్లీలో రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తత, పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలపై చర్చే ప్రధానాంశంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగినట్టు సమాచారం. దిల్లీలో తాజా పరిస్థితులను షాకు అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో టెలికాం సేవలను నిలిపివేశారు అధికారులు. మెట్రో సేవలకూ అంతరాయం ఏర్పడింది.

R-Day tractor rally: Security beefed up amid violence in Delhi
ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతపై షా సమీక్ష!

దిల్లీ హింసాత్మక ఘటనలతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. రైతుల ట్రాక్టర్​ ర్యాలీ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్​షా అధ్యక్షతన ఉన్నతస్థాయి అధికారులు సమావేశమైనట్టు సమాచారం. సరిహద్దులతో పాటు.. పలు ప్రదేశాల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై అమిత్‌ షాకు అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. అనుమతులిచ్చిన మార్గాలను వీడి.. రైతులు ఎర్రకోటకు చేరుకోవడం వంటి అంశాలపై అధికారులతో షా చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసు బలగాలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించిన వేళ.. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి.. అనుమతులిచ్చిన మార్గాన్ని వీడి ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో దిల్లీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఆంక్షల వలయంలో దిల్లీ..

ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తతల కారణంగా దేశ రాజధాని దిల్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంది. పార్లమెంటు, విజయ్‌ చౌక్‌, రాజ్‌పథ్‌, ఇండియా గేట్‌ వైపు వచ్చే అన్ని రహదారులు మూసివేశారు పోలీసులు. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. పర్యటకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:-నిరసనకారుల నుంచి పోలీసును కాపాడిన రైతులు

టెలికాం సేవలు నిలిపివేత..

ఎర్రకోట ఘటన జరిగిన కొద్దిసేపటికే.. దిల్లీ సరిహద్దులు సింఘు, ఘాజిపూర్‌, టిక్రి, ముకర్బా ఛౌక్‌, నంగోలి సహా ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో టెలికం సేవలు నిలిపివేస్తూ.. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా భద్రత.. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రాత్రి 12గంటల వరకు తాత్కాలికంగా ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొంది.

భారీ ట్రాఫిక్​.. మెట్రో బంద్​..

దిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. నిరసనల నేపథ్యంలో అనేక రోడ్లను అధికారులు మూసివేశారు. ఇతర ప్రాంతాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు.

జీటీకే రోడ్డు, ఔటర్​ రింగ్​ రోడ్డు, బాద్లి రోడ్డు, కేఎన్​ కట్జు మార్గ్​, మధుబాన్​ చౌక్​, కంజవాలా రోడ్డు, పల్లా రోడ్డును వాహనదారులు ఉపయోగించవద్దని ట్విట్టర్​ వేదికగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఐఎస్​బీటీ రోడ్డు, జీటీ రోడ్డు, పుష్త రోడ్డు, వికాశ్​ మార్గ్​, ఎన్​-హెచ్​ 24, నోయిడా లింక్​ రోడ్డులోనూ ప్రయాణించవద్దని కోరింది. ఫలితంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అదే సమయంలో మెట్రో సేవలకూ అంతరాయం కలిగింది. పలు లైన్లలో సమస్యాత్మక ప్రదేశాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేసినట్టు వివరించింది. గ్రే లైన్​లో ఉన్న అన్ని మెట్రో స్టేషన్లు మూతపడినట్టు ప్రకటించింది.

ఇదీ చూడండి:-'దిల్లీలో ఘర్షణలకు వారే కారణం'

ABOUT THE AUTHOR

...view details