సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న నిరసనలకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని రైతులు కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు రైతు సంఘాల్లో ఒకటైన ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ(ఏఐకేఎస్సీసీ).. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి తోమర్లకు లేఖ రాసింది. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ఇటీవల పలు సందర్భాల్లో మోదీ, తోమర్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏఐకేఎస్సీసీ ఈ విధంగా స్పందించింది.
"రాజకీయ పార్టీల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నిజానికి మా ఉద్యమం ప్రతిపక్షాల వైఖరిని మారేలా చేసింది."
-ఏఐకేఎస్సీసీ