అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై ఈ వారంలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర్పునకు సంబంధించి విజయోత్సవాలు లేదా నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 10న ఇచ్చిన ఉత్తర్వులలో మరో 30 సూచనలను జోడిస్తూ.. రామ జన్మభూమికి సంబంధించి సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, గోడలపై రాతలు, ఇతర కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు అధికారులు.
దేవతలను అవమానించడం, విగ్రహాలను ఏర్పాటు చేయటం, రామజన్మభూమికి సంబంధించిన ఊరేగింపుల కోసం సామాజిక మాధ్యమాలను వినియోగించటంపైనా ఆంక్షలు విధించారు జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ కుమార్ ఝా. అక్టోబర్ 12న జారీ చేసిన ఉత్తర్వులు డిసెంబర్ 28 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
అయోధ్య కేసుపై తీర్పు వెలువరించే సమయంలోనే ప్రముఖ పండుగలు ఛాట్ పూజ, కార్తీక పౌర్ణిమ, చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవం, గురునానక్ జయంతి, ఈద్ ఉల్ మిలాద్, క్రిస్మస్ ఉన్నందున ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.