తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 3:12 PM IST

ETV Bharat / bharat

సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్​-చైనా రెడీ

వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో అరుదైన రీతిలో ఉన్నతాధికారుల భేటీకి సిద్ధమయ్యాయి భారత్​, చైనా. మునుపు ఎన్నడూ లేనివిధంగా లెఫ్టినెంట్​ జనరల్ స్థాయి అధికారులు శనివారం భేటీ కానున్నారు. సరిహద్దు వివాదంలో పూర్తి పరిష్కారంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

India-China
భారత్​- చైనా

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న అసాధారణ పరిస్థితులు అనూహ్య చర్చలకు దారితీశాయి. వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​, చైనా అరుదైన రీతిలో శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నాయి.

ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థలైన భారత్​, చైనా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం భేటీ కానున్నారు. ఈ సమావేశం తూర్పు లద్దాఖ్​లోని స్పాంగుర్​ సమీపంలోని చూశూల్​ వద్ద జరుగుతుంది.

"ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరుదేశాలు సమావేశాన్ని ఆకస్మికంగా ఏర్పాటుచేశాయి. భారత్​- చైనా మధ్య సరిహద్దు వివాదంపై చర్చించేందుకు లెఫ్టినెంట్​ జనరల్ స్థాయి అధికారుల భేటీ ఇంతకముందు ఎన్నడూ జరగలేదు."

- సీనియర్​ సైన్యాధికారి

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు ఏ సమయంలోనైనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పరిష్కారం కోసం రెండు దేశాలు ముందుకొచ్చాయి.

పరస్పర చర్చలు..

భారత్​- చైనా మధ్య 2013 అక్టోబర్​లో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం (బీడీసీఏ) కుదిరింది. దీని ప్రకారం ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు మిలిటరీ థియేటర్లను పరస్పరం సందర్శిస్తారు. ఈ ఏడాది జనవరి 8, 9 తేదీల్లో చివరిసారిగా ఈ పర్యటన జరిగింది.

ఉత్తర కమాండ్​ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్​బీర్​ సింగ్​.. పీఎల్​ఏ జనరల్ హన్​ వెంగ్​వో, జనరల్ ఝావో ఝొగ్​షీ (వెస్ట్రన్​ థియేటర్ కమాండ్ సారథి)ని కలిశారు.

భారత్​తో సరిహద్దు బాధ్యతలు చూసుకునేది వెస్ట్రన్​ థియేటర్ కమాండ్ (డబ్ల్యూటీసీ). అంతకుముందు 2018 జులై మొదటివారంలో డబ్ల్యూటీసీలో రెండో కీలక అధికారి లెఫ్టినెంట్ జనరల్ లియూ షియావూ భారత్​లో పర్యటించారు.

యంత్రాంగాల ఏర్పాటు..

3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో వివాదాల పరిష్కారానికి విశ్వసనీయత పెంపు చర్యలు (సీబీఎం) కింద 5 సూత్రాల అమలుకు రెండు దేశాలు అంగీకరించాయి. ఘర్షణలను తగ్గించేందుకు బీడీసీఏ కింద ఇప్పటివరకు అనేక సీబీఎం యంత్రాంగాలను అమలు చేశారు. కమాండర్లు, ప్రభుత్వ అధికారుల మధ్య పతాక సమావేశాలు నిర్వహించారు.

భారత్- చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి సంప్రదింపులు, సహకారం కోసం కార్యాచరణ యంత్రాంగం(డబ్ల్యూఎంసీసీ) రూపొందించారు. ఇది సంయుక్త కార్యదర్శి, సరిహద్దు వ్యవహారాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో జరుగుతుంది. వార్షిక రక్షణ చర్చలు మాత్రం రక్షణ శాఖ కార్యదర్శి స్థాయిలో జరుగుతాయి.

దృశ్యాలు బహిర్గతం..

భారత్​- చైనా సైనికులు తీవ్రంగా ఘర్షణ పడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. ఈ దృశ్యాలు బయటకు వచ్చిన మరుసటి రోజే సమావేశం కావాలని నిర్ణయించారు ఇరు దేశాల అధికారులు.

భారత మీడియాపై..

చైనా ప్రభుత్వానికి చెందిన 'గ్లోబల్​ టైమ్స్' పత్రిక.. భారతీయ మీడియా తీరును తన సంపాదకీయంలో విమర్శించింది.

"చైనాపై భారత మీడియా అవగాహన పెంచుకోవాలి. చైనాకు సమతుల్యమైన కవరేజీ ఇచ్చేలా పనిచేయాలి. రెండు దేశాల మధ్య దృఢ సంబంధాల నిర్మాణానికి సహకరించాలి. ముందుగా పశ్చిమ దేశాల ప్రభావాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే భారత ప్రయోజనాలను మీడియా కాపాడుకోగలదు."

- గ్లోబల్ టైమ్స్

గ్లోబల్ టైమ్స్​ సంపాదకీయంలో పూర్తిగా చైనా ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తుంది. అధికారులు పరిశీలించి ఆమోదిస్తేనే కథనాలు ప్రచరణకు నోచుకుంటాయి.

ఇదీ జరిగింది..

చైనాకు దీటుగా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది భారత్. ఫలితంగా లద్ధాఖ్​లోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఇరు వర్గాలు బాహాబాహీ తలపడ్డారు. లద్ధాఖ్​లోని పాంగ్యాంగ్​ సరస్సు వద్ద భారత సైన్యం, ఐటీబీటీ బలగాలతో మే 9న చైనా పీపుల్స్ ఆర్మీ సైనికులు ఘర్షణకు దిగారు. అనంతరం మే 22న మరోసారి గొడవ పడ్డారు. రెండువైపులా దాదాపు 100 మంది గాయపడ్డారు. అంతకముందు మే 5, 6 తేదీల్లో ఉత్తర సిక్కింలో రెండు వర్గాలు తలపడ్డాయి. ఈ ఘర్షణల తర్వాత మరింతగా బలగాలను పెంచాయి రెండు దేశాలు. ఆర్టిలరీ గన్స్​తోపాటు భారీ వాహనాలను తరలించాయి.

(రచయిత- సంజీవ్​ బారువా)

ఇదీ చూడండి:సరిహద్దులో చైనా దూకుడుకు కారణం ఇదేనా?

ABOUT THE AUTHOR

...view details