కరోనా పరీక్షలు చేసేందుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ చెన్నై కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కొవిడ్ -19 మహమ్మారిని నియంత్రించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
చెన్నైలో ప్రస్తుతానికి 10 ప్రభుత్వ, 13 ప్రైవేటు ల్యాబ్ల్లో కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయితే, వారి పూర్తి వివరాలు ఆరోగ్యశాఖ, కార్పొరేషన్కు అందిస్తారు.
భయంతో.. తప్పుడు సమాచారం
కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో చాలా మంది తప్పుడు మొబైల్ నంబర్లు, చిరునామాలు ఇస్తున్నారు. కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయితే 14 రోజులు క్వారంటైన్ ఉండాలనే భయంతోనే వారు ఇలా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కొన్ని ప్రైవేటు ప్రయోగశాలలు బాధితుల వివరాలను ప్రభుత్వానికి అందించడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ కారణాల వల్ల వైరస్ బాధితులను గుర్తించడం కష్టం అవుతోంది.