అసోంలో రక్తతర్పణం.. నరబలికి విఫలయత్నం ఈశాన్య రాష్ట్రం అసోంలో భయంకర ఘటన జరిగింది. ఉదాల్గుడి జిల్లాలో ఓ కుటుంబం అమానవీయంగా ప్రవర్తించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనలో.... క్షుద్ర పూజల కోసం అభంశుభం తెలియని చిన్నారిని నరబలి అర్పించేందుకు సిద్ధపడింది ఓ క్రూర కుటుంబం. ఆ బాలుడు వేరెవరో కాదు... నరబలికి యత్నించిన వారి కుటుంబంలోని పంచ ప్రాణమే. కుమార్తె మృతితో భయాందోళనలకు లోనైన జాదవ్ సహారియా కుటుంబం... ఓ క్షుద్ర పూజారి మాటలు నమ్మి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ పూజల ద్వారా కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేరుతాయని, కుటుంబం క్షేమంగా ఉంటుందన్న భావనతో ఘోరకలికి సిద్ధపడింది. విషయం బయటికి రాగా... స్థానికులు ఈ దురాఘతాన్ని ఆపేందుకు యత్నించారు. వారిపై జాదవ్ కుటంబీకులు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలకు సమాచారమిచ్చారు. రాళ్లతో ఎదురుదాడికి దిగిన కుటుంబాన్ని కట్టడి చేసేందుకు భద్రతాసిబ్బంది కాల్పులు చేయాల్సి వచ్చింది. తీవ్ర ప్రయత్నం అనంతరం ఈ క్రూర కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న బలగాలు పోలీస్ స్టేషన్కు తరలించాయి.
అందరూ విద్యావంతులే...!
ఈ క్షుద్ర పూజలకు పూనుకున్న కుటుంబంలో యజమాని సహారియా సహా అందరూ ఉన్నత విద్యావంతులే. జాదవ్ సహారియా సైన్స్ టీచర్ కాగా, అతడి కుమారుడు ఎంబీఏ చదివాడు. సహారియా భార్య నర్స్గా పనిచేస్తోంది. ఇలాంటి విద్యావంతులున్న ఇంట.. ఇంతటి క్రూరమైన ఘటన జరుగుతుందని ఊహించలేదని స్థానికులు భయం భయంగా చెప్పారు.
ఇదీ చూడండి: కొన ఊపిరితో ఉండగానే తగలబెట్టారు..