పుట్టుకతోనే దివ్యాంగురాలు.. అయినా అందాల రాణే! ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది రాజస్థాన్కు చెందిన మినీ రాజ్పాల్. దివ్యాంగురాలైనా.. జయపుర అందాల పోటీల్లో విజేతగా నిలిచి అన్ని అవయవాలున్న వారికి స్ఫూర్తినిస్తోంది.
ఎదుటి వారు తన ముందే తనను కించపరుస్తున్నా మినీ పట్టించుకోదు ఎందుకంటే వారి వెక్కిరింపులు వినే శక్తి తనకు పుట్టుక నుంచే లేదు. ఒకవేళ అర్థమైనా, పన్నెత్తి ఓ మాట అనడానికి తనకు మాటలూ రావు. అయినా, ఏ రోజూ తను ఎదుటి వారికంటే తక్కువ అనుకోలేదు.
బాల్యంలో టీవీలో అందాల పోటీలు చూసి, మోడలింగ్పై ఆసక్తి పెంచుకుంది మినీ. ఆమె సోదరి, దివ్యాంగుల ప్రగతి కోసం పని చేస్తున్న మనోజ్ భరద్వాజ్ల ప్రోత్సాహంతో ఇంటి నుంచి బయటికెళ్లి చిన్న చిన్న అందాల పోటీల్లో పాల్గొంది. చాలా సార్లు అపజయాలు కూడా ఎదురయ్యాయి. కానీ, ఓటమికి కుంగిపోలేదు. నిరంతరం ప్రయత్నించి విజయవంతమైంది.
కేవలం పట్టుదల, ఆత్మస్థైర్యంతో జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని భారత ఖ్యాతిని పెంచింది.
2012లో ముంబైలో 'మిస్ డెఫ్ ఇండియా' ద్వితీయ రన్నరప్గా నిలిచింది మినీ. 2013లో సోఫియా బుల్గారాలో జరిగిన అంతర్జాతీయ మిస్ డెఫ్ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించింది. అంతే కాదు, 2014లో జయపురలో సామాన్యులతో పోటీపడి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
"నేను బాల్యం నుంచే దివ్యాంగురాలిని. కానీ, చాలా కలలు కనేదాన్ని. టీవీ చూస్తున్నప్పుడు వారిలా డిజైనర్ దుస్తులు ధరించి వేదికపై నడవాలనుకునేదాన్ని. కానీ, నేను దివ్యాంగురాలిని కావడం వల్ల, వారితో కలిసి నడవలేను అనుకున్నాను. తర్వాత, మా అక్క, మనోజ్ నన్ను ప్రోత్సహించారు. ప్రభుత్వం మాకు ప్రోత్సాహం ఇస్తే, మా లాంటి వారు ఎన్నో విజయాలు సాధిస్తారు. కానీ అలాంటి పథకాలేవి పెట్టనందుకు బాధగా ఉంటుంది."
-మినీ రాజ్పాల్, మిస్ జయపుర
భారత వ్యవస్థ పట్ల మినీ నిరాశ వ్యక్తం చేస్తోంది. సాధారణ మోడల్స్కు జాతీయ అవార్డు దక్కితేనే విస్తారంగా ప్రచారం చేస్తారు. కానీ, తమ లాంటి వారికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చినా పట్టించుకోరని వాపోతోంది.
ఇదీ చూడండి: విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు వద్దు: ఎన్సీఈఆర్టీ