కేరళ కోజికోడ్లోని కూడతాయిలో'జాలీ' అనే సైకో మహిళ సృష్టించిన విషాదం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆస్తి కోసం అత్త, మామ, సొంత భర్తను కూడా వదలకుండా విషం పెట్టి చంపింది జాలిలేని 'జాలీ'. చివరికి ఆమె మరిది ఫిర్యాదు మేరకు 17 ఏళ్ల తర్వాత ఈ కేసును ఛేదించారు పోలీసులు. కేరళలో తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగలోకి వచ్చింది.
ఏడుగురిని చంపి.. రూ.50 కోట్లు చోరీ
తిరువనంతపురం కరమన పట్టణంలో గోపీనాథన్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ఏడుగురు ఇదేవిధంగా అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. గత 15 ఏళ్లుగా వీరందరూ మరణించినట్లు అదే కుటుంబానికి చెందిన ప్రసన్న కుమారి అనే మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తి కోసమే వీరందరినీ ఎవరో చంపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తమ బంధువులను హత్య చేసి రూ.50 కోట్లు విలువ చేసే ఆస్తులను దొంగిలించినట్లు పోలీసులకు తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.