తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2020, 1:14 PM IST

Updated : Sep 14, 2020, 6:24 PM IST

ETV Bharat / bharat

'ప్రభుత్వ నిర్ణయాలతో 38 వేల ప్రాణాలు భద్రం'

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయాల కారణంగా దాదాపు 38వేల మంది ప్రాణాలు కాపాడామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ లోక్​సభలో తెలిపారు. అంతేకాకుండా 14 నుంచి 29లక్షల మందిని వైరస్​ బారిన పడకుండా రక్షించినట్లు పేర్కొన్నారు. భారత్​లో కరోనా ప్రభావం సాధారణ స్థాయిలోనే ఉందని, 60 శాతం కొవిడ్ కేసులు కేవలం 5 రాష్ట్రాల నుంచే నమోదవుతున్నట్లు వివరించారు.

Harsh Vardhan on corona prevention measures
పార్లమెంటులో కరోనా కట్టడి వివరాలు

దేశవ్యాప్త లాక్​డౌన్​ సహా కరోనా కట్టడికి కేంద్రం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా దాదాపు 38వేల మందికి ప్రాణ ముప్పు తప్పిందని చెప్పారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. అలాగే 14నుంచి 29లక్షల మందిని వైరస్​ బారిన పడకుండా కాపాడినట్లు లోక్​సభలో వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 92 శాతం మందికి వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో 5.8 శాతం మందికే ఆక్సిజన్ థెరపీ, కేవలం 1.7 శాతం మందికి ఐసీయూ అవసరమని స్పష్టం చేశారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను లోక్​సభలో వివరించారు హర్షవర్ధన్. దేశంలో 60 శాతం కొవిడ్-19 కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​ నుంచే వస్తున్నట్లు వెల్లడించారు.

కరోనా ప్రభావిత దేశాలతో పోలిస్తే భారత్​లో వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని హర్షవర్ధన్‌ లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రతి పది లక్షల జనాభాకు 3,328 కేసులు, 55 మరణాలు సంభవిస్తున్నట్లు వివరించారు. కరోనా కట్టడి విషయంలోనూ భారత్ మెరుగైన స్థితిలో ఉందని తెలిపారు.

రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రధాని మోదీ.. ఎప్పటికప్పడు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్షించారని హర్షవర్ధన్‌ గుర్తుచేశారు.

ఆదివారం దేశంలో 92,071 వేల కొవిడ్-19 కేసులు, 1,136 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 48 లక్షలు దాటగా.. మృతులు 80 వేలకు చేరువయ్యాయి.

ఇదీ చూడండి:తొలిరోజు సెషన్​లో ప్రశ్నోత్తరాల అంశంపై వాడివేడి చర్చ

Last Updated : Sep 14, 2020, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details