ఎన్నికల ప్రచారం అంటేనే మాటల తూటాలు, విమర్శలు, ప్రతి విమర్శలు. బిహార్ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వంలోనూ ఇవే సన్నివేశాలు. పార్టీల ప్రచారంలో అనేక అంశాలతో పార్టీలు ముందుకు వెళ్తుండగా.....శాంతిభద్రతల అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు ఓ అస్త్రంగా ఎంచుకున్నాయి. ఇదే సమయంలో అభ్యర్ధుల చరిత్రకు సంబంధించి ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) పలు విషయాలు బయటపెట్టింది.
31 శాతం మందిపై నేరారోపణలు..
బిహార్ శాసనసభకు అక్టోబర్ 28న తొలి విడత ఎన్నికలు జరగనుండగా...... అన్ని పార్టీల నుంచి కలిపి ఒక వెయ్యి 64 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అయితే ఇందులో 31శాతం అంటే ఏకంగా 328 మందిపై నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. వీరిలో అయిదేళ్ల జైలు శిక్ష పడి నాన్ బెయిలబుల్ కేసులు వంటివి ఎదుర్కొంటున్న వారు ఏకంగా 244 మంది ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా ఆర్జేడీకి చెందిన 41 మంది అభ్యర్ధుల్లో ఏకంగా 73 మంది శాతం మందిపై కేసులు ఉన్నట్లు తెలిపింది. భాజపా అభ్యర్ధుల్లో 71 శాతం మంది, లోక్ జనశక్తి అభ్యర్ధుల్లో 59శాతం మంది, కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 57శాతం మంది, జేడీయూ అభ్యర్ధుల్లో 43శాతం మంది, బీఎస్పీ అభ్యర్ధుల్లో 31శాతం మందిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. మొత్తం అభ్యర్ధుల్లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న వారు 29 మంది ఉండగా, వీరిలో ముగ్గురిపై అత్యాచార కేసులు ఉన్నట్లు తెలిపింది. 21 మందిపై హత్యకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది.