దిల్లీలో దాదాపు 29 శాతం ప్రజలు కొవిడ్-19 వైరస్ ప్రభావానికి గురైనట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు జరిపిన రెండో దఫా సెరోలాజికల్ సర్వేలో 29.1 శాతం ప్రజల్లో కొవిడ్ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సర్వేలో 15 వేల మంది నమూనాలను పరీక్షించినట్లు సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు.
దిల్లీలో వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడంలో భాగంగా అక్కడి ప్రభుత్వం సెరోలాజికల్ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేను దిల్లీ ప్రభుత్వం జులైలో ఒకసారి చేపట్టగా.. ఇప్పుడు రెండోసారి నిర్వహించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ ఈ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడం, ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా పలు ప్రాంతాల్లో ఈ సర్వేలు చేపట్టనున్నారు.