తెలంగాణ

telangana

ETV Bharat / bharat

26 రోజులైనా ఎవరికీ అందని 'మహా' పీఠం - మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి

సమావేశాలు, చర్చలు, సంప్రదింపులతో మహా రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల ఫలితాలు విడుదలై 26 రోజులైనప్పటికీ.. ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ తరుణంలో పవార్​ వ్యాఖ్యలు.. శివసేన నేతలను కలవరపెడుతున్నాయి. సీఎం కుర్చీని సేన చేజిక్కించుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.

26 రోజుల 'మహా' ప్రతిష్టంభన- వీడని చిక్కులు

By

Published : Nov 19, 2019, 5:06 AM IST

Updated : Nov 19, 2019, 8:17 AM IST

26 రోజులైనా ఎవరికీ అందని 'మహా' పీఠం

ఎన్నికల ఫలితాలు విడుదలై 26 రోజులు గడిచినప్పటికీ.. 'మహా' ప్రతిష్టంభన ఓ కొలిక్కి రాలేదు. మిత్రపక్షాలు భాజపా-శివసేనకు మెజారిటీ లభించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్​-ఎన్​సీపీ కూటమి తలుపుతట్టింది సేన. మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా.. ప్రభుత్వ స్థాపనపై నెలకొన్న అనిశ్చితికి ఇప్పట్లో తెర పడే అవకాశాలు కనిపించడం లేదు.

సమావేశాలు... చర్చలు...

ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు ఎదురవడం వల్ల మిత్రపక్షమైన కమల దళంతో తెగదెంపులు చేసుకుంది శివసేన. అనంతరం ఉద్ధవ్​ ఠాక్రేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారు ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​- కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సమావేశాలు, చర్చలు, సంప్రదింపులతో మూడు పార్టీల నేతలు తీరికలేకుండా గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం సోనియాతో భేటీ అయ్యారు పవార్​. అనంతరం మీడియాతో సమావేశమైన ఆయన... సేనతో పొత్తుపై సోనియాతో చర్చించలేదని తెలిపారు. మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైనే సోనియాతో చర్చించినట్టు వివరించారు.

శివసేనకు తప్పని కష్టాలు...!

ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవడానికి పట్టు వదలకుండా ప్రయత్నిస్తోంది శివసేన. విభిన్న సిద్ధాంతాలున్న పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడానికీ సిద్ధమైంది. కానీ సోనియాతో భేటీకి ముందు పవార్​ చేసిన వ్యాఖ్యలు.. శివసేన నేతలను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి.

"ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునేవారు ఎవరి దారి వారు చూసుకోవాలి, ఎవరి రాజకీయం వారిదే"అని అన్నారు పవార్​. దీనితో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై మరిన్ని చర్చలు అవసరమని ఎన్​సీపీ అధ్యక్షుడు పదేపదే చెప్పడమూ శివసేన నేతలను కలవరపెడుతోంది.

పవార్​ వద్దకు రౌత్​...

సోనియా-పవార్​ భేటీ జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఎన్​సీపీ అధ్యక్షుడిని కలిశారు శివసేన నేత సంజయ్​ రౌత్​. అనంతరం మీడియాతో సమావేశమయ్యారు. పవార్​తో భేటీలో మహా ప్రతిష్టంభనపై ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేసినప్పటికీ... రాష్ట్రంలో శివసేన నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Last Updated : Nov 19, 2019, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details