దేశంలో కొవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని ల్యాబొరేటరీలను.. కరోనా పరీక్షలకు అనుమతించే ప్రతిపాదనలను పరీశీలించాలని దేశంలోని 14 ప్రామాణిక వైద్య సంస్థలకు సూచించింది కేంద్ర ఆరోగ్యశాఖ.
దిల్లీలోని ఎయిమ్స్, ఛండిగఢ్లోని పీజీఐఎంఈఆర్, పుదుచ్చెరీలోని జిప్మర్ సహా మొత్తం 14 సంస్థలకు.. ల్యాబ్ల అర్హతను పరీశీలించే బాధ్యతలను అప్పగించింది.
సామర్థ్యం ఉన్న వాటి కోసం..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అభిప్రాయపడుతోంది. ఇందుకోసం సరైన సదుపాయాలు, పరీక్షల నిర్వహణ సామర్థ్యం కలిగిన ల్యాబొరేటరీల కోసం అన్వేషణ ప్రారంభించినట్లు ఐసీఎంఆర్ సీనియర్ అధికారులు వెల్లడించారు.
"ఈ సంస్థలు సరైన మార్గదర్శకత్వం వహించి రాష్ట్రాల్లో కొవిడ్-19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సహకరిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ప్రతిపాదనలను ఇవి పరిశీలిస్తాయి."-ఐసీఎంఆర్ సీనియర్ అధికారి
దిల్లీ, బిహార్ నుంచి వచ్చే ప్రతిపాదనలను దిల్లీలోని ఎయిమ్స్ పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, హరియాణా, హిమాచల్ప్రదేశ్, ఛండిగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యర్థనలను జీఐఎంఈఆర్ పరిశీలిస్తుందని చెప్పారు.
ఈశాన్య రాష్ట్రాలకు మేఘాలయాలోని ఎన్ఈఐజీఆర్ఐహెచ్ఎంఎస్, మహారాష్ట్ర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా ప్రాంతాల బాధ్యత నాగ్పుర్లోని ఎయిమ్స్కు కట్టబెట్టినట్లు స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్థాన్లకు జోధ్పుర్ ఎయిమ్స్, ఉత్తర్ప్రదేశ్కు లక్నో కింగ్ జార్జి వైద్య విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు ఎయిమ్స్ భోపాల్కు కేటాయించినట్లు తెలిపారు.
కరోనా విలయం ఇలా
దేశంలో ఇప్పటివరకు 2,415 కొవిడ్ మరణాలు సంభవించగా.. బాధితుల సంఖ్య 74,281కి పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో 122 మంది మృతి చెందారు. 3,525 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.