పదేళ్ల క్రితం కుటుంబ సభ్యుల నుంచి అనుకోకుండా దూరమైన ఓ మహిళ ఎట్టకేలకు.. వారిని కలుసుకుంది. బంగాల్కు చెందిన ఆ మహిళ.. టీనేజ్లో ఉన్నప్పుడు తప్పిపోయింది. అనంతరం కశ్మీర్కు చెందిన యువకుడిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. ఎట్టకేలకు ఇన్నేళ్లకు తిరిగి కుటుంబ సభ్యులను చేరుకుంది. అందుకు జాతీయ మహిళా కమిషన్, పోలీసులు, బంగాల్ రేడియో క్లబ్ సాయం అందించింది. ప్రస్తుతం ముగ్గురి పిల్లలకు తల్లిగా ఉన్న ఆ మహిళ.. శనివారం బారాముల్లాలో ఉన్న తన పుట్టింటివారిని కలుసుకుంది.
కొంత కాలం క్రితం ఆ మహిళ తన బావ సహాయంతో జాతీయ మహిళ కమిషన్ను సంప్రదించింది. చాలా రోజులుగా తన కుటుంబానికి దూరంగా ఉన్నానని.. ఎలాగైన వారి చెంతకు తనును చేర్చాలని కమిషన్కు విజ్ఞప్తి చేసింది. తాను బంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా చెప్పుకుంది. జయనగర్లో రైల్వే స్టేషన్ సమీపంలో తన ఇళ్లు ఉండేదని తెలిపింది. తప్పిపోయిన మహిళ విజ్ఞప్తితో.. దాదాపు నెల రోజుల క్రితం బంగాల్ పోలీసులను సంప్రదించింది మహిళా కమిషన్. బాధిత మహిళ కుటుంబాన్ని వెతికి పనిలో పడ్డ పోలీసులు.. బంగాల్ రేడియో క్లబ్ సాయంతో బాధితురాలి కుటుంబ ఆచూకీ కనుగొన్నారు. అనంతరం ఆ మహిళ సమాచారాన్ని వారికి చేరవేశారు.
"బాధితురాలి కుటుంబం కుల్తాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దెయుల్బరి గ్రామంలో ఉన్నట్లు బరుయ్పుర్ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి మాకు సమాచారం అందింది. దీంతో వారి ఆచూకీని గుర్తించాం." అని బంగాల్ రేడియో క్లబ్ సెక్రటరీ అంబరీష్ నాగ్ బిస్వాస్ తెలిపారు. విసృతమైన రేడియో క్లబ్ నెట్వర్క్, పోలీసుల సహకారంతో.. బాధితురాలి కుటుంబాన్ని గుర్తించగలిగినట్లు అతడు పేర్కొన్నారు. బంగాల్ ఉంటున్న బాధితురాలి కుటుంబం.. జూన్ 14న కశ్మీర్కు వెళ్లింది. పది సంవత్సరాల తరువాత శనివారం ఆ మహిళలను కలుసుకున్నారు. పోలీసు సిబ్బంది డబ్బు విరాళంగా ఇచ్చి, మహిళ కుటుంబానికి రైలు టిక్కెట్లు కొనుగోలు చేసి.. వారి బిడ్డను కలుసుకోవడానికి సాయం అందించారని కుల్తాలి స్టేషన్ అధికారి తెలిపారు.
మొదట్లో ఆమెతో కమ్యూనికేట్ చేయడం చాలా కష్టంగా ఉండేదని పోలీసులు తెలిపారు. మమ్మల్ని ఆమె అపరిచితులుగా భావించి.. మాతో మాట్లాడేందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. దీంతో రేడియో క్లబ్ సభ్యులు.. స్థానికంగా ఉన్న ఓ ఎన్జీఓ ప్రతినిధిని ఆమె ఇంటికి పంపించారని వివరించారు. అప్పటి నుంచి ఆమెను సంప్రదించడం మాకు సులభంగా మారిందని తెలిపారు. చాలా రోజులు గడిచిన కారణంగా ఆమె తన మాతృభాష మర్చిపోయిందని.. బెంగాలి మాట్లాడలేకపోతుందని రేడియో క్లబ్ మెంబర్ తెలిపాడు. ట్రాన్స్లేటర్ సాయంతో కాన్ఫరెన్స్ కాల్ను మాట్లాడించినట్లు అతడు వెల్లడించాడు. ఆ మహిళ భర్త ఆరోగ్య శాఖ పనిచేస్తున్నాడు. ఆమె బావ టూరిజం బిజినెస్ చేస్తున్నాడు. కశ్మీర్లో మహిళ పెళ్లి అయిన తరువాత ఆమెను కలువడం వీలుకాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
పదేళ్ల క్రితం బాధితురాలిని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు ఆమె బంధువు. అనంతరం ఆమెను ఎక్కడో విడిచిపెట్టి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బాధితురాలి కుటుంబం.. బంధువుపైనే ఆధారపడి జీవిస్తోంది. దీంతో అతన్ని ఎవ్వరు ప్రశ్నించలేకపోయారు. కొన్ని సార్లు అడిగే ప్రయత్నం చేసినప్పటికి.. అతడు సరైన సమాధానం చెప్పేవాడు కాదని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి గురించి ఆమె కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఇన్నేళ్ల పాటు ఆ మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎందుకు ప్రయత్నాలు చేయలేదో మాకు సృష్టమైన సమాచారం లేదన్నారు.