బంగాల్ అసెంబ్లీకి ఐదో దశ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగుతోంది. 45 స్థానాల పరిధిలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు 54.67శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఇటీవల నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా కూచ్బిహార్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
గాల్లోకి కాల్పులు..
ఉత్తర పరగణాల జిల్లా దేగంగలోని కురల్గచ్చాలో పోలింగ్ బూత్ వద్ద గుమిగూడిన జనాన్ని చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. అంతకుముందు వారిపై లాఠీఛార్జీ చేసినట్ల పోలీసులు తెలిపారు. దీనిపై వివరణకు ఆదేశించింది ఎన్నికల సంఘం.