దాద్రా, నగర్ హవేలీ స్వతంత్ర ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యకు ముందు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు రాశారని కాంగ్రెస్ ఆరోపించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సచిన్ సావంత్ మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. భాజపా నేతలు, అధికారులు వేధిస్తున్నారని తనకు సాయమందించాలని ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాసినా వారు పట్టించుకోలేదని, అందువల్లే దేల్కర్ తనువు చాలించారని ఆరోపించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని పేర్కొన్నారు. 'ఆత్మహత్యకు ముందు తనకు సాయమందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్షాకు దేల్కర్ పలుమార్లు లేఖలు రాశారు. ఇది ఓ ఎంపీ చావు బతుకులకు సంబంధించిన విషయం. ప్రధాని, హోంమంత్రి ఆ లేఖలకు స్పందిస్తే ఎంపీ బతికుండేవారు. వారు ఉద్దేశపూర్వకంగానే ఆయన లేఖలను విస్మరించారా? అని ప్రశ్నించారు.
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ ఖేడా పటేల్ సహా పలువురు కేంద్ర పరిపాలనాధికారులు దేల్కర్ను అవమానించారని, మానసిక హింసకు గురిచేశారని సావంత్ ఆరోపణలు చేశారు. 'దేల్కర్కు సంబంధం లేని నేరాల్లో ఆయనను ఇరికించేందుకు పాలనాధికారులు ప్రయత్నించారు. ఆయన కుటుంబాన్ని జైలుపాలు చేస్తామని తీవ్ర భయాందోళనకు గురిచేశారు. ఈ నేపథ్యంలోనే తనకు సాయమందించాలని దేల్కర్ పలుమార్లు లేఖలు రాశారు. ప్రధాని మోదీకి గతేడాది డిసెంబర్ 18న ఒకటి, ఈ ఏడాది జనవరి 31న మరో లేఖను రాశారు. ప్రధానిని అత్యవసర అపాయింట్మెంట్ కూడా అడిగారు. డిసెంబర్ 18న, జనవరి 12న అమిత్షాకు లేఖలు రాశారు. ఓం బిర్లాకు మూడు లెటర్లు, స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ భూపేంద్ర యాదవ్కు ఓ లేఖ రాశారు' అని సచిన్ సావంత్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ఎంపీ బతికుండేవారని అన్నారు. భాజపా నాయకత్వంపై పూర్తి నమ్మకం కోల్పోయి, వారి నుంచి ఎలాంటి సాయం అందదని నిర్ణయించుకొనే దేల్కర్ బలవన్మరణానికి పాల్పడ్డారని సావంత్ ఆవేదన వ్యక్తం చేశారు.