పోక్సో చట్టం కింద ఈ ఏడాది జనవరిలో ఓ మహిళ.. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలో ఉన్న హల్ద్వానీ జైలుకు వెళ్లింది. ఆమె అప్పటికే గర్భవతి. తాజాగా.. గత నెల 31న ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది. రిషికేష్లోని ఎయిమ్స్కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అనంతరం ఆమెను ఎయిమ్స్లో చేర్చారు. అక్కడే ఆమెకు పండంటి ఆడ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం బిడ్డతో పాటు మహిళను జైలుకు తీసుకెళ్లారు. వారికి అక్కడ వేదమంత్రాలతో స్వాగతం లభించింది. ఇందుకోసం స్థానిక పండితుడిని అధికారులు పిలిపించారు. సోమవారం ఆడబిడ్డకు నామకరణం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. ఈ పూర్తి వ్యవహారంపై జైలులోని ఇతర మహిళా ఖైదులు హర్షం వ్యక్తం చేశారు. జానపద గేయాలు ఆలపిస్తూ రోజును గడిపారు.