తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2022, 7:51 AM IST

ETV Bharat / bharat

ఆంగ్లేయుల అకృత్యాలను ఎదిరించి.. స్వాతంత్య్రం చూడకుండానే!

Azadi Ka Amrit Mahotsav: 'స్వరాజ్యం వస్తోంది మోహన్‌!'.. 1940లోనే అంపశయ్యపై ఉండి భవిష్య వాణి వినిపించిందో కంఠం! ఆ మోహన్‌- మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ.. ఆప్యాయంగా అలా పిలిచిన వ్యక్తి చార్లెస్‌ ఫ్రీర్‌ ఆండ్రూస్‌! క్రైస్తవ మతాచార్యుడిగా వచ్చి.. ఆంగ్లేయుల అకృత్యాలను వ్యతిరేకించి.. భారత స్వాతంత్య్ర ఆర్తిని ప్రపంచానికి వినిపించిన భారతీయ ఆప్తుడు ఆండ్రూస్‌.

azadi ka amrit mahotsav
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​

Azadi Ka Amrit Mahotsav: ఇంగ్లాండ్‌లో 1871లో జన్మించి క్రైస్తవ మతాచార్యుడిగా మారిన ఆండ్రూస్‌ ప్రచారం కోసం 1904 మార్చి 20న ముంబయిలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి దిల్లీ వెళ్లి కేంబ్రిడ్జి మిషన్‌లో చేరారు. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో తత్వశాస్త్రం బోధించటానికి కుదిరారు. ఆ సమయానికి భారత్‌లో జాతీయోద్యమం అనూహ్య మార్పులకు లోనవుతోంది. 1905లో బెంగాల్‌ విభజనతో ఆందోళన ఉద్ధృతమవుతున్న దశ. భారతీయులపై తన స్వదేశం బ్రిటన్‌ కుటిలనీతిని, ఆంగ్లేయుల అకృత్యాలను అర్థం చేసుకున్న ఆండ్రూస్‌ భారతీయుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నారు. జాతీయోద్యమానికి మద్దతుగా రంగంలోకి దిగారు. కానీ.. తెల్లవాడు, పైగా క్రైస్తవ మిషనరీగా వచ్చిన ఆయన్ను భారతీయులు నమ్మలేదు. ఆంగ్లేయ గూఢచారిగా అనుమానించారు. మరోవైపు.. బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా ఆయన్ను తమ వాడిగా చూడలేదు. వచ్చిన పని మరచి.. భారతీయుడిలా మారి భారతీయుల పక్షాన మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోయింది. హిందీ కూడా నేర్చుకొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయటంతో.. ఉపకారవేతనాల జాబితాలోంచి ఆండ్రూస్‌ పేరును తొలగించింది బ్రిటిష్‌ సర్కారు.

చార్లెస్‌ ఫ్రీర్‌ ఆండ్రూస్‌

అనుబంధం కుదిరింది..

Charles Freer Andrews Story: సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసేప్పుడు.. రాజకీయ అంశాలను కళాశాలలో చర్చించరాదంటూ బ్రిటిష్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆండ్రూస్‌ దీన్ని ఉల్లంఘించారు. దీంతో.. కాలేజీపై ప్రభుత్వం కన్నెర్రజేయటంతో పాటు.. ఆయనపై నిఘా పెంచింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, గోపాల కృష్ణ గోఖలేలతో ఏర్పడ్డ స్నేహం ఆయన్ను భారత జాతీయ కాంగ్రెస్‌ వైపు నడిపించింది. ఇంతలో.. గోఖలే సూచన మేరకు ఆండ్రూస్‌ దక్షిణాఫ్రికా వెళ్లి గాంధీజీని కలిశారు. అప్పటికే అక్కడ గాంధీజీ సత్యాగ్రహ ప్రయోగాలు మొదలెట్టారు. ఇద్దరికీ మంచి అనుబంధం కుదిరింది. భారత్‌కు వచ్చి జాతీయోద్యమ పగ్గాలు చేపట్టాలని గాంధీని తొందరపెట్టిన వారిలో ఆండ్రూస్‌ కూడా ఒకరు. అంతేగాక.. బ్రిటన్‌లో తనకున్న పలుకుబడిని కూడా భారత జాతీయోద్యమ విజయానికి ఉపయోగించారు ఆయన. ప్రధాన మంత్రులు, మంత్రులు, అనేక మంది ఎంపీలతో పదేపదే అనధికారిక సంప్రదింపులు జరుపుతూ.. భారత ప్రయోజనాల కోసం పోరాడేవారు. పుణె ఒప్పందం సమయంలో గాంధీ ఉపవాస దీక్ష పట్టి బలహీనమైన వేళ.. లండన్‌లో ప్రధానమంత్రిని స్వయంగా కలసి కమ్యూనల్‌ అవార్డుపై తక్షణమే నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు ఆండ్రూస్‌. తద్వారా గాంధీ ప్రాణాలు కాపాడారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి లండన్‌ వచ్చిన గాంధీజీని, ఆయన ప్రయోగాలను ప్రపంచ మీడియాకు పరిచయం చేసింది కూడా ఆయనే. భారత స్వాతంత్య్రోద్యమం, భారతీయుల పట్ల ప్రపంచానికి, బ్రిటన్‌లోని రాజకీయవర్గాల్లో సానుకూల దృక్పథం పెరగటానికి తుదికంటా కష్టపడారు. వీటితో పాటు సామాజిక సంస్కరణలు, కార్మికుల ఉద్యమాలకు మద్దతిచ్చేవారు. పేదల కష్టాలను, కడగండ్లను తుడవటానికి ఎప్పుడూ ముందుండే ఆండ్రూస్‌కు ఠాగూర్‌ 'దీనబంధు' అని బిరుదిచ్చారు. తన సంపాదనంతా భారత్‌లోని పేదలు, జాతీయోద్యమం కోసం ఖర్చు చేసిన ఆయన 1925-27 మధ్య ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగానూ పని చేశారు. సహాయ నిరాకరణోద్యమంలో అరెస్టయిన ఆండ్రూస్‌.. అంటరానితనం నిర్మూలన కోసం నారాయణగురు, అంబేడ్కర్‌లతో కలసి కృషి చేశారు. ఠాగూర్‌ శాంతినికేతన్‌లో సైతం చాలారోజులు పనిచేశారు.

1935లో ఇంగ్లాండ్‌కు వెళ్లి 40లో తిరిగి వచ్చాక ఆండ్రూస్‌ జబ్బు పడ్డారు. కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్చి.. ప్రత్యేక చికిత్స ఇప్పించారు. కానీ ప్రత్యేక సదుపాయాలు అక్కర్లేదని.. సామాన్యులతో పాటు తనకూ చికిత్స చేస్తే చాలని పట్టుబట్టిన భారత బంధువు.. స్వాతంత్య్రాన్ని చూడకుండానే.. 1940 ఏప్రిల్‌ 5న కోల్‌కతాలోనే కన్నుమూశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:ఘనంగా గణతంత్ర వేడుకలు- అబ్బురపరిచిన విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details