తెలంగాణ

telangana

AZADI KA AMRIT MAHOTSAV: నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనమే టాప్​! కానీ..

By

Published : Feb 2, 2022, 6:36 AM IST

AZADI KA AMRIT MAHOTSAV: భారత్‌కు ఆధునికత నేర్పాం... ముందుకు నడిపించాం అని చెప్పే ఆంగ్లేయులు అత్యంత దారుణంగా మనల్ని తిరోగమనంలోకి నెట్టారు. వందల ఏళ్ల పాటు సుసంపన్న ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారతావనిని అట్టడుగుకు తీసుకొచ్చారు.

AZADI KA AMRIT MAHOTSAV
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనమే టాప్

AZADI KA AMRIT MAHOTSAV: ఏటా బడ్జెట్‌ రాగానే జీడీపీ లెక్కలు వేయటం... ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటంపై కలలు కనటం మనకు ఆనవాయితీ. కానీ ఇప్పుడు కంటున్న ఈ కల ఎన్నడో సాకారమైందనీ... ఆంగ్లేయుల పాలన కారణంగా అది కుప్పకూలిందనేది చరిత్ర చెప్పే సత్యం. బ్రిటన్‌, అమెరికాల కంటే ఎంతో సంపన్నంగా ఉండేది భారతావని. ఇది భారత్‌ తనకు తానిచ్చుకునే కితాబు కాదు. బ్రిటన్‌ ఆర్థిక చరిత్రకారుడు ఆగ్నస్‌ మాడిసన్‌ వెల్లడించిన నగ్నసత్యం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాల పునర్‌వ్యవస్థీకరణ కోసం ఏర్పడింది ఆర్గనైజేషన్‌ ఫర్‌ యూరోపియన్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ (ఓఈఈసీ). తర్వాత 60ల్లో ఇది ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)గా రూపాంతరం చెందింది. ప్రపంచంలో అత్యధిక ఆదాయంగల దేశాలకు ఇందులో సభ్యత్వముంది. వీరంతా కలసి ఆర్థికాభివృద్ధిపై ఓ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు... అధ్యయనం చేసి... మార్గదర్శనానికి ఓ నివేదిక ఇవ్వాలని ఆగ్నస్‌ మాడిసన్‌ను కోరారు. కేవలం వర్తమానాన్ని చూడకుండా... చరిత్ర పుటల్లోకి తవ్వి చూశారు మాడిసన్‌. 'ది వరల్డ్‌ ఎకానమీ... ఎ మిలేనియల్‌ పర్‌స్పెక్టివ్‌' అనే నివేదికను 2001లో సమర్పించారు. మాడిసన్‌ పరిశోధనలో అందరినీ ఆశ్చర్య పరిచే అనేక అంశాలు వెలుగు చూశాయి.

దాదాపు వెయ్యికిపైగా సంవత్సరాల్లో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రపంచ యవనికలో వాటి స్థానాన్ని అధ్యయనం చేసిన మాడిసన్‌... క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నుంచి 15వ శతాబ్ది దాకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది అగ్రశ్రేణి అని తేల్చారు. క్రీస్తు శకం 1000 నాటికి ప్రపంచ జీడీపీలో భారత్‌ వాటా 28శాతం. ఈస్టిండియా కంపెనీ మనదేశంలో అడుగుపెట్టే నాటికి ఇది సుమారు 23 శాతంగా ఉంది. యావత్‌ ఐరోపా అంతా కలిపినా అంత లేదు. అలనాటి భారతీయుల నైపుణ్యమే ఈ ఆర్థిక పరిపుష్టికి కారణం. నూలు దుస్తులు, పట్టుకుంటే జారిపోయే మెత్తటి పట్టు, ఊలు వస్త్రాలు, ఉక్కు, ఇనుము వస్తువులు... సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు, కళాకృతులు, ఆభరణాలు... ఇలా భారత్‌లో తయారయ్యే ఏ ఉత్పత్తైనా అత్యంత నాణ్యమైనదై ఉండేది. సముద్రమార్గాల ద్వారా విదేశాలకు వెళ్లేవి. విదేశీయులను ఆకర్షించేవి. వాటి స్థానంలో వెండి, బంగారంతో ఓడలు భారత్‌కు తిరిగి వచ్చేవి. భారత నౌకాపరిశ్రమకు ఆ కాలంలో ప్రపంచంలోనే మంచి పేరు ఉండేది. 400 నుంచి 500 టన్నుల బరువుగల మన్నికైన నౌకల్ని భారత్‌లో తయారు చేసేవారు.

అలా వెలుగు వెలిగిన భారత్‌పై విదేశీయుల కన్నుపడింది. మొఘలులు వచ్చాక కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉండేది. 1757 తర్వాత ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీ పెత్తనం మొదలవగానే... భారత బంగారు బాతు క్షీణదశ ఆరంభమైంది. ఆంగ్లేయులు తమ దేశంలో పారిశ్రామిక విప్లవాన్ని ప్రోత్సహిస్తూ... భారత్‌లో పరిశ్రమలను కూకటి వేళ్లతో పెకిలించారు. ఆంక్షలతో, చట్టాలతో, శిక్షలతో ఇక్కడి పరిశ్రమలను, నిపుణులను దెబ్బతీశారు. బ్రిటన్‌ నుంచి దిగుమతులు పెంచారు. అడ్డగోలు పన్నులతో గ్రామీణ భారతం కుప్పకూలింది. ఆర్థిక వేత్త ఉత్సా పట్నాయక్‌ ప్రకారం... 1765 నుంచి 1940 మధ్య... ఆంగ్లేయులు భారత్‌ నుంచి తరలించుకుపోయిన మొత్తం... 45 లక్షల కోట్ల డాలర్లు! ఈస్టిండియా కంపెనీ వచ్చే సమయానికి ప్రపంచ జీడీపీలో 23 శాతం ఉన్న భారత వాటా... బ్రిటిష్‌ ప్రభుత్వం మనల్ని విడిచిపెట్టి వెళ్లేనాటికి సుమారు 3 - 4 శాతానికి పడిపోయిందంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను ఆంగ్లేయులెలా పీల్చిపిప్పి చేశారో అర్థం చేసుకోవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:భయం నుంచి పుట్టిన బడ్జెట్‌.. ఫస్ట్​ ఎప్పుడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details