తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇనుము లేకుండానే రామమందిర నిర్మాణం- 21 అడుగుల గ్రానైట్ పునాది- 'అయోధ్య అద్భుతాలు' ఇవే - శ్రీరాముడిమందిరం విశేషాలు

Ayodhya Ram Mandir Specialities : ఎక్కడా ఇనుము వాడకుండా అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోంది. మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ ఆలయంలో 392 స్తంభాలను ఏర్పాటు చేశారు. గర్భగుడిలో 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన శ్రీరాముడి గుడికి సంబంధించిన విశేషాలు మీకోసం.

Ayodhya Ram Mandir Specialities Full Information Here With Images
Ayodhya Ram Mandir Specialities

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 11:16 AM IST

Ayodhya Ram Mandir Specialities :అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్న ఆ రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన ప్రధాన పనులు పూర్తవగా, మిగతా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి మందిర ప్రారంభోత్సవాన్ని అట్టాహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్‌. ఈ నేపథ్యంలో యావత్​ భారతావని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య ఆలయానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయోధ్య రామమందిరం గ్రాఫిక్​ చిత్రం.

Full Details Of Ayodhya Shri Ram Temple :

  • నగర సంప్రదాయ శైలిలో అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం నిర్మాణాన్ని చేపట్టారు. ఉత్తరభారతంలో ఉన్న మూడు హిందూ వాస్తు శైలిల్లో ఇదీ ఒకటి. పశ్చిమ, తూర్పు భారత్‌లోనూ ఇటువంటి నిర్మాణాలను చూడవచ్చు.
  • తూర్పు నుంచి పడమర దిక్కుకు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఆలయ నిర్మాణం జరుగుతోంది.
  • మూడు అంతస్తుల్లో ఈ ఆలయం నిర్మితమవుతోంది. కాగా, ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు.
  • ఆలయంలో మొత్తం 392 స్తంభాలతో పాటు 44 గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.
  • ప్రధాన ఆలయం గర్భగుడిలో 51 అంగుళాల 'బాల రాముడి' విగ్రహన్ని ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.
  • మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్‌ ఉంటుంది.
  • గుడిలో ప్రత్యేకంగా ఐదు మండపాలను కట్టారు. నృత్యం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనా మండపాలుంటాయి.
    ఆలయంలో ఏర్పాటు చేయనున్న సింహం ప్రత్యేక శిల్పం.
  • ఆలయ స్తంభాలు, గోడలపై దేవుళ్లు, దేవతామూర్తుల శిల్పాలు దర్శనమిస్తాయి.
  • తూర్పు వైపున ఏర్పాటు చేసిన సింహ ద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించాలి. ఇక్కడ నుంచి 32 మెట్లను ఏర్పాటు చేశారు.
  • దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా లిఫ్టులు, ర్యాంపులను సిద్ధం చేస్తున్నారు.
  • ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో 732 మీటర్ల పొడవైన గోడను నిర్మించారు. దీని వెడల్పు 14 అడుగులు.
  • నిజానికి నగర శైలి సంప్రదాయంలో ఆలయానికి ప్రహరీ అనేది ఉండదు. ద్రవిడ ఆలయకళలో మాత్రం ఇది కనిపిస్తుంది. కానీ ఉత్తర, దక్షిణ ఆలయ నిర్మాణశైలికి ప్రతీకగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం.
  • ఆలయం నాలుగు మూలల మరో నాలుగు ఆలయాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్య భగవానుడి గుడి కాగా రెండోది భగవతి మూడవది గణపతి నాల్గవది శివుడి కోసం కడుతున్నారు.
  • ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో శ్రీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయం ఉంటుంది. దక్షిణ భుజంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడిని నిర్మిస్తున్నారు.
    గుడిలో ఏర్పాటు చేయనున్న ఐరావతం శిల్పం.
  • పురాణకాలం నాటి సీతాకూపంను కూడా ఆలయానికి దగ్గర్లోనే గమనించవచ్చు.
  • వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల, నిశద్‌రాజ్‌, శబరి, దేవిఅహల్య ఆలయాలను కూడా టెంపుల్​ కైంప్లెక్స్​లో నిర్మిస్తున్నారు.
  • నైరుతి భాగంలోని నవరత్న కుబేర్‌ తిలపై ఉన్న పురాతన శివుడి మందిరాన్ని పునరుద్ధరించారు. ఇక్కడే శ్రీ జటాయువు దేవతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
  • ఆలయం నిర్మాణంలో ఎక్కడ కూడా ఇనుము లోహాన్ని వాడకపోవడం విశేషం.
  • ఆలయం కింద 14 మీటర్ల మందం కలిగిన రోలర్‌ కాంపాక్టు కాంక్రీట్‌(ఆర్‌సీసీ)ను వినియోగించారు.
  • భూమిలోని తేమ వల్ల ఆలయ నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా రక్షణగా గ్రానైట్‌తో 21 అడుగుల ఎత్తైన పునాదిని వేశారు.
ప్రతిష్ఠకు సిద్ధంగా హనుమంతుడి శిల్పం.
  • ఇవే కాకుండా మురుగునీరు, నీటిశుద్ధి నిర్వహణ, అగ్నిమాపక వ్యవస్థ వంటి కనీస అవసరాలను ఏర్పాటు చేస్తున్నారు.
  • ఆలయం కోసం ప్రత్యేకంగా ఓ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఆలయ కాంప్లెక్సులోనే కడుతున్నారు.
  • భక్తుల సౌకర్యార్థం 25వేల మంది సామర్థ్యంతో ఉన్న ఓ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
  • అయోధ్య రాముయ్య దర్శనం కోసం వచ్చే భక్తులు తమ వెంట తెచ్చుకున్న లగేజీని భద్రపరుచుకునేందుకు ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేస్తున్నారు.
  • వైద్య పరంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడే మూత్రశాలలు, బాత్‌రూమ్‌లు, కుళాయిలను ఏర్పాటు చేశారు.
  • ముఖ్యంగా ఆలయంలో పర్యావరణం-నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు నిర్వాహకులు. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న శ్రీరాముడి గుడిచుట్టూ పచ్చదనం ఫరిడవిల్లేలా దాదాపు 70శాతం స్థలాన్ని చెట్లపెంపకం కోసం కేటాయించారు.
    ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న జటాయువుడి శిల్పం.

ABOUT THE AUTHOR

...view details