తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 2:20 PM IST

ETV Bharat / bharat

దేశంలోనే అతిపెద్దదిగా, తాజ్​మహల్​కన్నా అందంగా అయోధ్య మసీదు- మక్కా ఇమామ్​తో శంకుస్థాపన

Ayodhya Masjid Construction : తాజ్​మహల్ కంటే అందంగా అయోధ్యలో మసీదును నిర్మించనున్నట్లు దాని అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వెల్లడించారు. దేశంలోనే అతిపెద్దదిగా నిలవనున్న ఈ మసీదుకు మక్కా నుంచి ఇమామ్​ను రప్పించి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మహిళలు, పురుషులు ప్రార్థనలు చేసుకునేలా ఇందులో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

Ayodhya Masjid Construction
Ayodhya Masjid Construction

Ayodhya Masjid Construction :దేశంలోనే అతిపెద్ద మసీదును అయోధ్యలోని ధన్నీపుర్​లో నిర్మించనున్నారు. తాజ్​మహల్ కంటే అందంగా ఉండేలా ఈ మసీదును సిద్ధం చేయనున్నట్లు 'మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అభివృద్ధి కమిటీ' ఛైర్మన్, ముంబయికి చెందిన బీజేపీ నేత హాజీ అరాఫత్ షేక్ తెలిపారు. మక్కాలోని కాబాలో ప్రార్థనలు చేసే ఇమామ్​తో మసీదుకు ( Indias Largest Mosque ) శంకుస్థాపన చేయించనున్నట్లు వెల్లడించారు. ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఈ మసీదు నిర్మాణం చేపట్టనున్నారు.

మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు
21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్​ను ఈ మసీదులో ఉంచనున్నట్లు అరాఫత్ షేక్ తెలిపారు. 9 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మసీదు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఐదు వేల మంది పురుషులు, నాలుగు వేల మంది మహిళలు మసీదులో ఒకేసారి ప్రార్థనలు చేసుకోవచ్చని వివరించారు. మసీదు కాంప్లెక్స్​లో విద్య, వైద్య కేంద్రాలు ఉంటాయని చెప్పారు. తమ వద్ద ఉన్న నిధులతో అదనపు భూమిని సేకరిస్తున్నట్లు చెప్పారు. అయితే, మసీదుకు సంబంధించిన పేపర్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని అరాఫత్ తెలిపారు.

మసీదు నమూనా

"మసీదు సౌందర్యం తాజ్ మహల్​ను మించి ఉంటుంది. వాజూఖానా వద్ద భారీ అక్వేరియం మసీదుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాయంత్రం వేళ మసీదులోని ఫౌంటెయిన్​లు ఆకట్టుకుంటాయి. మసీదు కాంప్లెక్స్​లో క్యాన్సర్ ఆస్పత్రి, పాఠశాల, కళాశాల, మ్యూజియం, లైబ్రరీ ఉంటాయి. శాకాహార వంటశాల ద్వారా సందర్శకులందరికీ ఉచితంగా భోజనం అందిస్తాం. మహిళలు, పురుషులకు వేర్వేరు వసతులు ఉంటాయి. శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ కట్టడాన్ని చూసేందుకు అన్ని మతాల వారు వస్తారు."
-హజీ అరాఫత్ షేక్, మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అభివృద్ధి కమిటీ ఛైర్మన్

ప్రవక్త పేరు మీదుగా!
ధన్నీపుర్​లో నిర్మించే మసీదుకు 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు'గా నామకరణం చేశారు. దేశంలోని అన్ని మసీదులకు ప్రాతినిధ్యం వహించే 'ఆల్ఇండియా రాబ్తా-ఇ-మసీదు' ఆర్గనైజేషన్ ఇటీవల సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రవక్త పేరు మీదుగా మసీదుకు నామకరణం చేసింది. ఈ సందర్భంగా మసీదు కొత్త డిజైన్​ను విడుదల చేసింది. నెలవంక, ఐదు మినార్లతో మసీదు ఉండనుంది. ఇస్లాం మతంలో కీలకమైన కలీమా, నమాజ్, రోజా, హజ్, జకత్​ను ఈ మినార్లు ప్రతిబింబించనున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అయోధ్యలోని రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయం రూపుదిద్దుకుంటోంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మసీదు నిర్మాణానికి ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యకు 25 కి.మీ దూరంలోని ధన్నీపుర్​లో భూమి కేటాయించింది. 2020లో ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటైన ట్రస్ట్- మసీదు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటోంది.

అయోధ్య మసీదుకు తొలి విరాళం హిందువుదే

100 దేవతా విగ్రహాలతో భారీ ఊరేగింపు- రాముడి జీవితం ఉట్టిపడేలా అయోధ్యలో శోభాయాత్ర

ABOUT THE AUTHOR

...view details