తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2023, 4:15 PM IST

Updated : Apr 4, 2023, 7:24 PM IST

ETV Bharat / bharat

పర్యటకులపై విరిగిపడిన మంచుకొండ.. ఏడుగురు మృతి

సిక్కింలో పర్యటకులపై ఒక్కసారిగా మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా పర్యటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్మీ, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

sikkim avalanche
sikkim avalanche

సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. నాథులా పాస్‌ వద్ద భారీ మంచు చరియ విరిగిపడిన ఘటనలో.. ఏడుగురు పర్యటకులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో.. 150 మందికిపైగా పర్యటకులు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను కాపాడే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 22మందిని కాపాడినట్లు వారు చెప్పారు. సాయంత్రం 5:35 గంటల తర్వాత హిమపాతం ప్రభావం ఎక్కువైనందున సహాయ చర్యలు తాత్కాలికంగా నిలపివేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడినవారిని సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లోని ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్​ గోలే గ్యాంగ్​టక్​లోని ఆస్పత్రికి చేరుకున్నారు.

మంగళవారం మధ్యాహ్నం తూర్పు సిక్కింలోని సంగమో సరస్సు సమీపంలో జవహర్​లాల్​ నెహ్రూ మార్గ్​లోని 14వ మైలురాయి వద్ద ఒక్కసారిగా మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు కాలువలో పడిపోగా.. వందలాది మంది పర్యటకులు ఈ హిమపాతంలో చిక్కుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే సహాయక సిబ్బంది కాపాడిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలో బోర్డర్​ రోడ్స్ ఆర్గనైజేషన్​ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగాయని.. రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారీ హిమపాతం కారణంగా సహాయక చర్యలు తాత్యాలికంగా నిలుపుదల చేసిన్టుల ఆర్మీ అథికారులు వెల్లడించారు. వీరితో పాటుగా మంచుచరియల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు.

సహాయక చర్యల్లో పాల్గొన్న రక్షణ సిబ్బంది

నాథులా రోడ్డుపై మంచుచరియలు విరిగిపడడం వల్ల ఒక్కసారిగా రహదారి అంతా మూసుకుపోయింది. దీంతో ప్రయాణికులకు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది.. దాదాపు 350 మందితో పాటుగా 80 వాహనాలను వెనక్కు తీసుకువచ్చారు. ఈ హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించడం, ఘటనా ప్రాంతంలో చిక్కుకున్న వాహనాలను వెనక్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఎం పీఎస్​ గోలే మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు గ్యాంగ్​టక్​ చేరుకున్నారు. ప్రస్తుతం ఇండియన్​ ఆర్మీకి చెందిన ఐదు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఆర్మీ కల్నల్ అంజన్​ కుమార్​ తెలిపారు.

సంగమో సరస్సు సిక్కింలోని ప్రసిద్ధ పర్యటక ప్రదేశం. నాథులా పర్వతపాస్​ చైనా సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతం చూడడానికి చాలా అందంగా ఉన్నందున ప్రముఖ పర్యటక కేంద్రంగా గుర్తింపు పొందింది. దీంతో అనేక మంది ఈ అందాలను తిలకించడానికి ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఇంత మొత్తంలో మంచుచరియలు విరిగడడం ఎప్పుడూ జరగలేదని అధికారుల తెలిపారు.

Last Updated : Apr 4, 2023, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details