Attack on RTI activists in India: ఓ ఆర్టీఐ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. కాళ్లు, చేతులు విరిగేలా తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. కాళ్లకు ఇనుప చువ్వలు, మేకులను దింపి చిత్ర హింసలు పెట్టారు. చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్, బాఢ్మేర్ జిల్లాలో జరిగింది. గిఢా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంపలియా గ్రామానికి చెందిన సహ చట్టం కార్యకర్త అమరా రామ్ గోదారాను అపహరించి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
బాధితుడు అమరా రామ్ గోదారా ఆర్టీఐ కార్యకర్త.. తమ ప్రాంతంలోని లిక్కర్ మాఫియాపై పలు సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామ పంచాయతీలో జరిగే కుంభకోణాలపై ప్రశ్నించే వారు. మంగళవారం సాయంత్రం.. జోధ్పుర్ వెళ్లి స్వగ్రామానికి తిరి వచ్చిన క్రమంలోనే కొందరు దుండగులు ఆయన్ను అపహరించి.. దారుణంగా కొట్టారు.
గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న అమరా రామ్ను గుర్తించిన గ్రామస్థులు.. జోధ్పుర్లోని ఎండీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
నాలుగు బృందాలు ఏర్పాటు..
' బాఢ్మేర్ జిల్లాలోని గిదా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 21న ఆర్టీఐ కార్యకర్తపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ప్రస్తుతం జోధ్పుర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్టీఐ ద్వారా అతను పోలీసులు, ఇతరులకు సమాచారం ఇచ్చాడు. అందువల్లే ఇలా చేశారని భావిస్తున్నాం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాం. భాడ్మేర్ అదనపు ఎస్పీ బాధితుడి వద్దకు వెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు. కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. నిందితులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటాం.'
- జిల్లా ఎస్పీ దీపక్ భార్గవ
దాడి వెనక మాజీ సర్పంచ్..
తనపై జరిగిన దాడి వెనక కుంపలియా మాజీ సర్పంచ్ నాగరాజ్ ఉన్నాడని బాధితుడు ఆరోపించారు. పరేవు లిక్కర్ కాంట్రాక్టర్ సైతం ఉన్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఈజీఏ రోడ్డు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సమాచారం కావాలని ఆర్టీఐ దరఖాస్తు చేయటం వల్ల తనపై కోపం పెంచుకున్నారని.. గత మంగళవారం జోధ్పుర్ నుంచి గ్రామానికి చేరుకున్న క్రమంలో బస్సు దిగగానే అపహరించారని చెప్పారు. తీవ్రంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు గోదారా. రెండు కాళ్లపై మూడు మేకులు కొట్టారని చేప్పారు.
" దుండగులు గుర్తు పట్టకుండా ముఖాలకు మాస్కులు ధరించారు. తీవ్రంగా కొట్టాక.. చనిపోయినట్లు భావించిన దుండగులు నాగరాజ్కు ఫోన్ చేసి మిషన్ పూర్తయిందని చెప్పారు. ఆ తర్వాత నన్ను వదిలి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గిఢా పోలీస్ స్టేషన్ అధికారి, సిబ్బంది సైతం నేరస్థులకు కొమ్ముకాస్తున్నారు. వారి కనుసన్నల్లోనే అక్రమ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారి ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. బాఢ్మేర్ ఎస్పీ మాత్రమే దీనిపై దర్యాప్తు జరపగలరు."