మాఫియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన వ్యాపారవేత్త, జంతు ప్రేమికుడు వినీత్ బగారియా(32) కుటుంబాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం పరామర్శించారు. బగారియాను కాపాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. దిబ్రూగఢ్లోని మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జిల్లా ఎస్పీని మందలించారు. "ప్రజలకు స్నేహితుల్లా వ్యవహరించాలని పోలీసులకు మా ప్రభుత్వం అనేకసార్లు సూచించింది. దిబ్రూగఢ్లాంటి ప్రాంతంలోనే పోలీసులు మా అభ్యర్థనను అర్థం చేసుకోలేకపోతే.. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నించారు హిమంత బిశ్వ శర్మ.
వినీత్ బగారియాను కాపాడలేకపోయినందుకు సిగ్గుపడుతున్నా. అమాయకులకు అండగా నిలబడడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైంది. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎల్లప్పుడూ ప్రజలకు పోలీసులు అండగా ఉండాలి. నేరస్థులతో పోలీసులు రాజీ పడొద్దు.
-అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
వినీత్ వ్యవహారంలో నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. భైదుల్లా ఖాన్, నిషాంత్ శర్మ అనే ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. కీలక సూత్రదారి సంజయ్ శర్మ కోసం గాలిస్తున్నారు.