తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ..నిర్ణయం రేపటికి వాయిదా

Arguments on Chandrababu House Custody Petition in ACB Court: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో (Skill Development Case) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడ అనిశా కోర్టు రిమాండ్ (Remand) విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును హౌస్‌ కస్టడీకి అనుమతించాలంటూ ఆయన తరపు లాయర్లు పిటిషన్‌ దాఖలు చేయగా.. ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా వేశారు.

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 3:40 PM IST

Updated : Sep 11, 2023, 7:41 PM IST

Arguments on Chandrababu House Custody Petition in ACB Court
Arguments on Chandrababu House Custody Petition in ACB Court

Arguments on Chandrababu House Custody Petition in ACB Court: తెలుగుదేశం అధినేత చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు పూర్తయ్యాయి. జైల్లో చంద్రబాబుకు భద్రత కల్పించే అంశం పైనే అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా కోర్టుకు తెలిపారు. కరడు గట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో నే ఉన్నారని లూద్రా పేర్కొన్నారు. సెక్యూరిటీ థ్రెట్ ను అనుసరించే ఎన్ఎస్జి లాంటి భద్రత కల్పించారని చంద్రబాబు తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీ కి సంబధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని సుప్రీం కోర్టు న్యాయవాది లుద్రా కోర్టుకు విన్నవించారు. గౌతం నవర్కర్ కేసులో హౌజ్ రిమాండ్ కు సుప్రీం కోర్టు అనుమతించిందనీ పేర్కొన్నారు. మూడు విడతల వాదనల అనంతరం హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.

ఏఏజీ సుధాకర్‌రెడ్డి: సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందన్న ఆయన.. జైలులో చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత కల్పించినట్లు తెలిపారు. జైలు లోపలా, బయటా పోలీసుల భద్రత ఉందన్నారు. పోలీసులు 24 గంటలూ డ్యూటీలో ఉన్నారని.. అవసరమైతే వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సుధాకర్​రెడ్డి తెలిపారు.

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు: జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జైల్లో అవసరమైన అన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను.. ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హిమబిందు ఆదేశించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడంతోపాటు తగిన భద్రతనూ కల్పించాలన్నారు. ఇంటి నుంచి వచ్చిన ఔషధాలను, ఆహారాన్నీ అనుమతించండి అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు అంతకుముందు పిటిషన్‌ దాఖలు చేశారు. 'మావోయిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు.. ఇతర వర్గాల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి: సాధారణ బ్లాక్‌లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు అని.. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు మందులు కూడా వాడాల్సి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలకు అర్హులు కాబట్టి ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి' అని విజ్ఞప్తి చేశారు. ఆయనకు హౌస్‌ అరెస్ట్​ను అనుమతించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్​పై ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.

Last Updated : Sep 11, 2023, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details