Anand Mahindra Bolero: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్ తయారు చేసిన తుక్కుబండిని తనకు అప్పగిస్తే.. బదులుగా బొలెరోను కానుకగా ఇస్తానని గత నెలలో హామీ ఇచ్చారు ఆనంద్ మహీంద్ర. మాట ఇచ్చిన విధంగానే దత్తాత్రేయ కుటుంబానికి సోమవారం బొలెరోను అందించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో మంగళవారం షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర. బొలెరో తీసుకున్న అనంతరం దత్తాత్రేయ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
దత్తాత్రేయ లోహర్.. స్థానికంగా కంసాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమారుడికి కారు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయితే అంత స్థోమత లేని దత్తాత్రేయ తుక్కు వాహనాల విడి భాగాలు సేకరించి.. సొంతంగా ఓ నాలుగు చక్రాల వాహనం తయారుచేశారు. బైక్ తరహాలో కిక్ ఇస్తే స్టార్ట్ అయ్యేలా దీన్ని రూపొందించారు.
Anand Mahindra Bolero tweet: ఈ కథనాన్ని ఈటీవీ భారత్ మహారాష్ట్ర గతేడాది డిసెంబర్ 20న ప్రచురించింది. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వాహనం ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన మహీంద్రా వాహనాన్ని తయారు చేసిన వ్యక్తి నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. వాహనం ఆటోమొబైల్ నిబంధనలను అందుకోలేకపోయినప్పటికీ మన దేశ ప్రజల తెలివితేటలు, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని ట్వీట్ చేశారు.
నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా స్థానిక అధికారులు ఇప్పుడైనా, తర్వాతైనా ఈ వాహనాన్ని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారన్నారు ఆనంద్ మహీంద్రా. ఈ బండిని తనకు ఇస్తే బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తానని.. ఆఫర్ ఇచ్చారు. దత్తాత్రేయ సృజనాత్మకతను మహీంద్రా రీసర్చ్ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతామని, అది తమలో స్ఫూర్తిని నింపుతుందంటూ నాాడు ట్వీట్ చేశారు.