తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈ రాష్ట్రంలోనూ ఏక్​నాథ్​ శిందే పుట్టుకొస్తారు'.. భాజపా 'నాన్​సెన్స్​' జోస్యం! - అన్నామలై న్యూస్​

ఏక్​నాథ్​ శిందే లాంటి వ్యక్తి తమిళనాడులోనూ పుట్టుకొస్తారని అన్నారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై. మహారాష్ట్ర తరహాలో అక్కడ కూడా అధికార మార్పిడి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని అధికార డీఎంకే తోసిపుచ్చింది.

annamalai on dmk
annamalai on dmk

By

Published : Jul 6, 2022, 3:49 PM IST

Updated : Jul 6, 2022, 4:02 PM IST

మహారాష్ట్ర తరహాలో త్వరలో తమిళనాడులోనూ అధికారం చేతులు మారుతుందని జోస్యం చెప్పారు భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. ఆ రాష్ట్రంలోనూ ఏక్​నాథ్​ శిందే లాంటి వ్యక్తి పుట్టుకొస్తారని విశ్లేషించారు. మహారాష్ట్రలో బాల్​ ఠాక్రే, తమిళనాడులో కరుణానిధి కుటుంబాల మధ్య సారూప్యతల్ని వివరిస్తూ మంగళవారం చెన్నైలో జరిగిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నామలై.

"బాల్​ ఠాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ సినిమాల్లోకి వెళ్లారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మొదటి కుమారుడు ముత్తు కూడా అంతే. ఇద్దరూ సినిమాలు చేయాలని అనుకున్నారు కానీ అవి సరిగా ఆడలేదు. ఠాక్రే రెండో కుమారుడు కుటుంబానికి దూరంగా ఉన్నారు. కరుణ రెండో కుమారుడు అళగిరి కూడా అంతే. ఠాక్రే మూడో కుమారుడు ఉద్ధవ్​కు మహారాష్ట్ర సీఎం అయ్యే అవకాశం వచ్చింది. అదే తరహాలో స్టాలిన్ తమిళనాడు సీఎం అయ్యారు. ఉద్ధవ్​ కుమారుడు ఆదిత్య రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా అంతే. ఇద్దరూ వారివారి పార్టీల యువజన విభాగాలకు నేతృత్వం వహిస్తున్నారు. తమిళనాడు.. మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతోంది. ఇక్కడ కూడా ఏక్​నాథ్​ శిందే పుట్టుకొస్తారు.

రెండున్నరేళ్ల క్రితం మహారాష్ట్రలో మూడు పార్టీలు కూటమి ఏర్పాటు చేశాయి. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి అధికారం చేపట్టాయి. మహారాష్ట్రలో 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న భాజపాను వెనక్కు నెట్టి 57 మంది శాసనసభ్యులున్న శివసేన అధికారం చేపట్టింది. హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ భాజపా కార్యకర్తల్ని సాధ్యమైనంత వేధించారు. అప్పుడు ఏక్​నాథ్​ శిందే 12 మంది ఎమ్మెల్యేలతో సూరత్ వెళ్లారు. ఇది రాజధర్మం. జరగాల్సిన సమయం వస్తే జరిగి తీరుతుంది. మహారాష్ట్రలో జరిగింది. తమిళనాడులోనూ మీరు చూస్తారు" అని అన్నారు అన్నామలై.

అన్నామలై వ్యాఖ్యల్ని డీఎంకే తేలికగా తీసుకుంది. తమ పార్టీలో తిరుగుబాటుకు ఆస్కారమే లేదని స్పష్టం చేసింది. "ఈ మధ్య ఆయన నాన్​సెన్స్​ అంతా మాట్లాడుతున్నారు. ఆయన్ను అసలు నేను సీరియస్​గా తీసుకోవడం లేదు" అన్నారు డీఎంకే మాజీ ఎంపీ భారతి. మరో సీనియర్ నేత కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్రం చాలా మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:ఠాక్రేపై 'ఆటో- మెర్సిడెస్' పంచ్.. డ్రమ్స్ వాయిస్తూ శిందేకు భార్య స్వాగతం

Last Updated : Jul 6, 2022, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details