తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 3:23 PM IST

Updated : Jan 27, 2021, 3:30 PM IST

ETV Bharat / bharat

దిల్లీ హింసపై షా వరుస సమీక్షలు

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నివాసంలో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో చెలరేగిన హింసపై షాకు అధికారులు నివేదిక అందించారు. ఒక్కరోజు వ్యవధిలో అధికారులతో షా భేటీ కావడం ఇది రెండోసారి.

amit-shah-held-high-level-meeting-on-wednessday-a-day-after-farmers-tractor-rally-violence
దిల్లీ హింసపై మరోమారు షా సమీక్ష

దిల్లీ హింస నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నివాసంలో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి, దిల్లీ పోలీసు కమిషనర్​, ఐబీ చీఫ్​తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో చెలరేగిన హింసపై షాకు అధికారులు సవివరంగా నివేదిక అందించారు.

ఘర్షణలు చెలరేగిన అనంతరం ఒకరోజు వ్యవధిలో ఉన్నతస్థాయి అధికారులతో షా భేటీకావడం ఇది రెండోసారి.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై దృష్టి సారించాలని అన్ని దర్యాప్తు సంస్థలను కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశించింది. దేశ రాజధానిలో అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించింది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిర్ణీత సమయం, నిర్దేశిత మార్గాలను వీడి నిరసనకారులు ఐటీఓ, ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు, జలఫిరంగులు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు- రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది.

200మంది అరెస్ట్​...

ట్రాక్టర్​ ర్యాలీలో హింసకు సంబంధించి ఇప్పటివరకు 200మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వారందరినీ ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు 22 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి.

ఐటీఓ వద్ద బీభత్సం..

నిరసనల సమయంలో ముఖ్యంగా ఐటీఓ(ఆదాయపు పన్నుశాఖ కార్యాలయం) వద్ద ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. 10వేలకుపైగా రైతులు, 600 ట్రాక్టర్ల మీద వచ్చి ఆందోళన చేపట్టారని పోలీసులు పేర్కొన్నారు. ఫలితంగా 6 డీ​టీసీ(దిల్లీ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​) బస్సులు, 5 పోలీసు వాహనాలతో పాటు 70 ఇనుప బారికేడ్లు ధ్వంసమైనట్టు వివరించారు. అనేకమంది పోలీసు సిబ్బంది గాయపడినట్టు వెల్లడించారు. హింసకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లో ఈ వివరాలను పేర్కొన్నారు.

మెట్రో..

హింసాత్మక ట్రాక్టర్​ ర్యాలీ ముగిసినప్పటికీ.. దిల్లీలో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ముఖ్యంగా మెట్రో సేవలపై ఈ ప్రభావం అధికంగా పడింది. లాల్​ కిలా మెట్రో స్టేషన్​ను బుధవారం కూడా ముసివేసే ఉంచారు అధికారులు. జామా మసీదు స్టేషన్​లో మాత్రం రాకపోకలను నియంత్రించారు. ఈ వివరాలను ట్విట్టర్​ ద్వారా దిల్లీ మెట్రో ప్రజలకు తెలియజేసింది.

ఇదీ చూడండి:-దిల్లీ హింసాత్మక ఘటనలపై సుప్రీంలో వ్యాజ్యం

Last Updated : Jan 27, 2021, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details