శానసభ ఎన్నికల విషయంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న బంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బంగాల్లో తొలిసారిగా పర్యటించనున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో నిర్వహించే భాజపా ప్రచార సభలో ప్రధాని పాల్గొంటారు. భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న వేళ ప్రధాని పాల్గొనబోయే తొలి ప్రచార సభపై అందరి దృష్టి నెలకొంది.
ఈ సభను విజయవంతం చేయాలని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతీలో ప్రజలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాయి.
భాజపాలోకి మిథున్!
మోదీతో పాటు భాజపా అగ్రనేతలు సైతం ఈ ర్యాలీకి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించాయి. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సభా వేదికపై కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా శనివారం రాత్రి మిథున్ చక్రవర్తితో సమావేశమయ్యారు. ఈ భేటీతో మిథున్ భాజపాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సీపీఎంకు సన్నిహితంగా ఉన్న మిథున్.. అనంతరం టీఎంసీ తరపున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. రాజకీయాల్లోంచి వైదొలిగే ఉద్దేశంతో పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు పునరాగమనం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
బంగాల్లో 8 దశల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండగా, తొలి దశ మార్చి 27న జరగనుంది.
ఇదీ చూడండి:కౌన్ బనేగా బంగాల్ టైగర్?