'ఎంత పనిచేశారు తలైవా.. ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎంతలా ఎదురుచూశాం.. చివరకు...'
ఇది సూపర్స్టార్ రజనీకాంత్ సగటు అభిమాని బాధ మాత్రమే కాదు. తలైవా సాయంతో తమిళనాట రాజకీయ ప్రభంజనం సృష్టిద్దామనుకున్న భాజపా పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఎందుకంటే తమిళనాట దశాబ్దాలుగా డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కళగం), అన్నాడీఎంకే (అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం) పార్టీలదే హవా. అక్కడ జాతీయ పార్టీల ప్రభావం అంతంత మాత్రమే. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఆ లోటును రజనీకాంత్ సాయంతో భర్తీ చేద్దామని కమలనాథులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తలైవా ఇచ్చిన షాక్తో భాజపా అయోమయంలో పడింది.
నేను రాలేను.. క్షమించండి..
అన్నీ సవ్యంగా జరిగితే 2021 జనవరి 17 ఎంజీఆర్ జయంతిన తమిళనాట మధురైలో రజనీకాంత్ పార్టీ ప్రకటించేవారని సమాచారం. కానీ ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయంతో తమిళనాట ఎన్నికల లెక్కలు తారుమారయ్యాయి.
"ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితుల వల్ల పార్టీ పెట్టే ఆలోచనలను విరమించుకున్నాను. నా కోసం అభిమానుల్ని రాజకీయాలకు బలిపశువుల్ని చేయలేను. మీకు బాధ కలిగిస్తున్నందుకు.. క్షమించండి. ఇది అంత సులువు కాదు.. కానీ తప్పదు."
- రజనీకాంత్, సినీనటుడు
రజనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకేసారి భాజపాకు నిరాశను.. అన్నాడీఎంకే, డీఎంకేకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఎందుకంటే కమల దళ వ్యూహాలు, లెక్కల్ని తలైవా నిర్ణయం తలకిందులు చేసింది. రజనీ అనూహ్య నిర్ణయాన్ని ద్రవిడ పార్టీలు మాత్రం స్వాగతించాయి.
- ఇదీ చూడండి:రజనీ వెనక్కి తగ్గడానికి కారణాలివేనా?
భాజపా భారీ ఆశలు..
రజనీకాంత్ రాజకీయ పార్టీపై అభిమానుల కంటే భాజపానే భారీ ఆశలు పెట్టుకుందని నిపుణులు అంటున్నారు. తలైవా ప్రజాకర్షణ శక్తి సాయంతో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాలని కమలదళం భావించిందని విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడు అంచనాలు తారుమారయ్యాయి. అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ దీనిపై స్పందించేందుకు కూడా నిరాకరించారు. కేంద్ర సహాయమంత్రి పొన్ రాధాకృష్ణ రజనీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
"అనుమానమే లేదు. కచ్చితంగా రజనీకాంత్ నిర్ణయం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ, ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. అలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని భాజపా కోరుకుంటూనే ఉంటుంది."
- పొన్ రాధాకృష్ణ, కేంద్ర సహాయ మంత్రి