మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 4వ తరగతి చదువుతున్న 10ఏళ్ల బాలికపై ఓ దుండగుడు అత్యాచారం జరిపి, తర్వాత గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు వెంటనే విచారణ జరిపి గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తలాసరి తాలూకాలోని డోంగారీలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఉదయం పాఠశాలకు వెళ్లింది. బాలిక స్కూల్ అయిపోయాక ఇంకా ఇంటికి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు గ్రామంలో అంతా వెతికారు. ఎంత వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు తలాసరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ అజయ్ వాసవే నాలుగు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ఆధారాల ద్వారా.. పోలీసు బృందాలు కొన్ని గంటల వ్యవధిలోనే సంబంధిత అమ్మాయిని గుర్తించి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇసామ్(45)ను పోలీసులు పట్టుకుని దర్యాప్తు చేయగా.. అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు పదేళ్ల పాప తాతతో కలిసి బోటులో చేపలు పట్టేవాడు. డబ్బుల విషయంలో వారి మధ్య వివాదాలు రావడం వల్ల నిందితుడు పాపను అపహరించి గుజరాత్ రాష్ట్రంలోని భిలాద్ సంజన్ రోడ్డులో అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. ఈ మేరకు తలాసరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సెక్షన్ 302, 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.