తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లక్ష్మణరేఖ'ను పాక్​ ఎన్నిసార్లు దాటాలనుకుందో తెలుసా?

భారత్​-పాక్​ మధ్య ఉండే నియంత్రణ రేఖ వద్ద తరచుగా ఉద్రిక్తతలు చూస్తుంటాం. పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించిన వార్తలు చదువుతుంటాం. అసలు ఎల్​ఓసీ అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఏర్పడింది? గత పదేళ్లలో పాక్​ ఎన్నిసార్లు ఈ లక్ష్మణరేఖను దాటాలనుకుంది? అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం..

By

Published : Nov 15, 2020, 5:19 PM IST

Updated : Nov 15, 2020, 6:40 PM IST

A brief history of ceasefire violations at Line of Control
నియంత్రణరేఖ వెంబడి 'కాల్పుల విరమణ' అంటే..?

అది 1971.. భారత్​-పాకిస్థాన్​ మధ్య 13 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. పాకిస్థాన్‌ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న బంగ్లాదేశ్​కు విముక్తి కలిగించేందుకు దాయాది దేశంతో తీవ్రంగా పోరాడింది భారత్​. చివరకు ఆ పోరులో నెగ్గిన ఇండియా.. బంగ్లాకు స్వాతంత్ర్యాన్ని అందించింది. అయితే ఓడిపోయిన పాక్​ మాత్రం అప్పట్నుంచి తన దుర్నీతి ప్రదర్శిస్తూ.. ఇప్పటికీ సరిహద్దుల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. ఆ యుద్ధం తర్వాత ఎన్నోసార్లు ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఆ క్రమంలో ఇరుదేశాల మధ్య 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం చాలా కీలకం. అప్పటినుంచే ఇరుదేశాల సరిహద్దుల మధ్య ఓ 'లక్ష్మణ రేఖ' ఏర్పాటైంది. అదే నియంత్రణ రేఖ.

కనిపించని గీత..

నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) అనేది ప్రత్యక్షంగా కనిపించదు. ఇదొక ఊహాజనిత రేఖ. దీన్ని తొలిసారి 1947-48 మధ్య గుర్తించారు. అయితే ఆ సమయంలోనే ఇరుదేశాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. నెమ్మదిగా చినికి చినికి 1948లో ఘర్షణలకు దారితీసింది. అనంతర కాలంలో అదే రేఖకు ఇరువైపులా భారత, పాకిస్థాన్​ భద్రతా బలగాలు గస్తీ ప్రారంభించాయి. 1972లో సుచెత్​ఘర్​ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఆ రేఖను.. కాల్పుల విరమణ రేఖ(సీఎఫ్​ఎల్​)గా పిలవటం ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు(ఐబీ) పూర్తి భిన్నంగా ఉంటుంది.

'సిమ్లా'తో మార్చేశారు...

1972లోనే జరిగిన సిమ్లా ఒప్పందం సమయంలో అంతకుముందు ఉండే కాల్పుల విరమణ రేఖ(సీఎఫ్​ఎల్​)ను.. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ)తో భర్తీ చేశారు. ఈ రెండింటి మధ్య సారూప్యత ఉన్నప్పటికీ.. భారత్​-పాకిస్థాన్​ మధ్య సరిహద్దుల్లో చిన్నపాటి మార్పులు చేర్పులు జరిగాయి. అక్రమంగా సరిహద్దుల్లోకి ప్రవేశించడం, స్మగ్లింగ్​, అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రాంతంలో పోలీసు బలగాలు ఉంటాయి. అయితే నియంత్రణ రేఖ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇరు దేశాల సైన్యాలు గస్తీ నిర్వహిస్తుంటాయి. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులను యునైటెడ్​ నేషనల్​ అబ్జర్వర్స్​ గ్రూప్​(యూఎన్​ఎమ్​ఓజీఐపీ) పర్యవేక్షిస్తూ ఉంటుంది.

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు..

  • 1972లో నియంత్రణ రేఖను నిర్ధరించిన అనంతరం సరిహద్దుల్లో దాదాపు 10ఏళ్ల పాటు ఎటువంటి ఉద్రిక్తతలు జరగలేదు.
  • 1980 నుంచి యుద్ధ ట్యాంకులతో గస్తీ (సీఎఫ్​వీ) జోరందుకోగా.. 1990లో కశ్మీర్​లో తిరుగుబాటు తారాస్థాయికి చేరుకునే నాటికి ఇరుదేశాలు పూర్తి బలగాలను మొహరించాయి.
  • 2001లో భారత్​ తన సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మించడం ప్రారంభించిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద కాల్పులు తీవ్రతరం అయ్యాయి.
  • 2003 తర్వాత ఇరుదేశాలు యుద్ధ ట్యాంకులను దాదాపు 5 ఏళ్లపాటు నిషేధించాయి. ఈ దేశాల మధ్య ఆ సమయంలో జరిగిన చర్చలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అయితే ముంబయిలో 2008 ఉగ్రదాడుల తర్వాత శాంతి చర్చలకు తావు లేకుండా పోయాయి. క్రమంగా సరిహద్దుల్లో యుద్ధట్యాంకుల అలజడి పెరిగింది.
  • 2013లో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలు ఎక్కువయ్యాయి. ప్రతి ఏడాది అవి గణనీయంగా పెరుగుతున్నాయి.
  • 2017లో భారత్​ 1,970 సార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్​ ఆరోపించింది. 2018లో పాకిస్థాన్​ 936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని భారత్​ ఆరోపించింది. ఆనాటికి 15 ఏళ్లలోనే ఆల్​టైమ్​ రికార్డది.
  • 2018 మే నెలలో జమ్ముకశ్మీర్​లో.. భారత్​ నాన్​-ఇనీషియేషన్​ ఆఫ్​ కాంబాట్​ ఆపరేషన్లను ప్రకటించింది. దీన్నే రంజాన్​ కాల్పుల విరమణ అంటారు. ఇది 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కొనసాగింపు. అయితే కాలక్రమేణ ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిని.. 2019, 2020లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

2003 కాల్పుల విరమణ ఒప్పందం..

  • 2003, నవంబర్​ 25-26 తేదీల్లో ఇరుదేశాల మిలిటరీ జనరల్స్​ సమక్షంలో చర్చలు జరిగాయి. ఆ సమయంలో జమ్ముకశ్మీర్​ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులకు చరమగీతం పాడేద్దామని పాక్​ ఏకపక్షంగా నిర్ణయించింది. ఇదే కాల్పుల విరమణ ఒప్పందం(సీఎఫ్​ఏ)గా పేర్కొంటారు.
  • సీఎఫ్​ఓ 2003అనేది లిఖితపూర్వక ఒప్పందం కాదు. 1949నుంచి 1972 మధ్య జరిగిన చర్చల్లో చేసుకున్న ప్రతిపాదనల ప్రకారం.. జమ్ముకశ్మీర్​లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు హాట్​లైన్లు, ఫ్లాగ్​ మీటింగ్​లు ఏర్పాటు చేసుకోవాలని అంగీకరించుకున్నాయి ఇరుదేశాలు.

ఎలా ఉల్లంఘిస్తారంటే...?

నియంత్రణ రేఖ, జమ్ముకశ్మీర్​లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఎక్కువగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు నమోదవుతుంటాయి. ఆ సమయంలో కాల్పులు చేయడం నుంచి ప్రాణాంతక ఆయుధాలతో దాడికి పాల్పడుతుంటారు. ఇవి స్థానిక ప్రజలనూ ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి.

పాకిస్థాన్​ 11వేల సార్లు..

  • 2010 నుంచి 2020 సెప్టెంబర్​ వరకు దాదాపు 11,572 సార్లు పాకిస్థాన్​ సరిహద్దుల్లో శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనల్లో దాదాపు 240 మంది భారతీయలు(122 మంది ప్రజలు, 118 మంది భద్రతా బలగాలు) చనిపోయారు. 673 మంది పౌరులు, 594 మంది సైనికులు గాయపడ్డారు.
  • 2010తో పోలిస్తే 2019 నుంచి పాకిస్థాన్​ ఉల్లంఘనలు దాదాపు 50 రెట్లు పెరిగాయి.
  • 2018లో 2,140 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంటే రోజుకు దాదాపు 6సార్లు. ఈ ఘటనల్లో 59మంది చనిపోగా.. 30 మంది పౌరులు మరణించారు. మొత్తం 259 మంది గాయాలపాలయ్యారు.
  • 2019లో రోజుకు 9సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది దాయాది దేశం. మొత్తం 3,479 సార్లుగా అది రికార్డయింది. వీటిల్లో 37మంది పౌరులు, 19మంది భద్రతా బలగాలు చనిపోగా.. 249మంది ప్రజలు, 122మంది సైనికులు క్షతగాత్రులయ్యారు.
  • జమ్ముకశ్మీర్​ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్​ వరకు దాదాపు 3,186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్​.

భారత సైన్యం పనేంటి...?

సైన్యం ఈ ప్రాంతంలో రెండు పాత్రలు పోషిస్తుంది. నియంత్రణ రేఖ పవిత్రతను కాపాడటం, చొరబాట్లను నిరోధించడం. అయితే పాకిస్థాన్​ మాత్రం ఉగ్రవాదులను భారత్​లోకి ఎగదోసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వారికి ఆయుధాల సరఫరా చేసి భారత్​లోని ఉగ్రవాదాన్ని పోషించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యక్షంగా, టెక్నాలజీ సాయంతో వారికి మద్దతిస్తూ చొరబాట్లకు ప్రేరేపిస్తుంది. వాటిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం నిరంతరం గస్తీ కాస్తుంటుంది.

పాకిస్థాన్​ వెనకున్న కారణాలివే..

నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారత్​ భూభాగంలోని వేర్పాటువాదులకు సందేశాలు పంపుతూ రెచ్చగొట్టే చర్యలను ప్రేరేపిస్తుంది పాకిస్థాన్​. ఇది అంతర్జాతీయ సమాజం నిబంధనలను ఉల్లంఘించడమే. ఇదే ఇరుదేశాల మధ్య అణు-సాయుధ పోరుకు కారణమవుతోంది. ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులు, వేర్పాటువాద నేతలకు బలం తగ్గటం వల్ల కశ్మీర్​ లోయలో విధ్వంసం సృష్టించడం పాక్​కు కష్టతరంగా మారింది. అందుకే నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలకు పాల్పడుతోంది.

కుప్వారాలోనే..

నియంత్రణ రేఖ వద్ద కుప్వారా సెక్టార్​లో ఎక్కువ బలగాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతాల వల్ల సైనిక పోస్టులు అధికంగా ఏర్పాటు చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లోని పోస్టుల్లో మాత్రం బలగాల సాంద్రత తక్కువగానే ఉంటుంది. ఇక ఈ ప్రాంతంలోని కెరన్​, మాచిల్​, దక్షిణ గల్లీస్​ నుంచి పాక్​ చొరబాటుదారులు భారత్​లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

Last Updated : Nov 15, 2020, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details