బంగాల్లోని 'ది నార్త్ బంగాల్ మెడికల్ కాలేజ్' ఆసుపత్రిలో అసాధారణ రీతిలో మరణాలు నమోదవుతున్నాయి. కేవలం 5 రోజుల్లో 89 మంది చనిపోయారు. అంతేగాక అక్టోబర్ 9 నుంచి 15వ తేదీ వరకు 118 మంది మరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. కానీ ఆసుపత్రి యాజమాన్యం వీటిని సాధారణ మరణాల కిందే లెక్కగడుతోంది. మృతుల బంధువుల వాదన మాత్రం మరోలా ఉంది.
దుర్గాపూజ సందర్భంగా ఆసుపత్రికి డాక్టర్లు రాలేదని.. దీంతో రోగులు ఇబ్బందిపడి చనిపోయినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఫిజీషియన్ లేకపోవడం వల్ల చాలామంది మరణించినట్లు చెప్పారు. ప్రతి ఏడాది డాక్టర్లు అందరూ మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ ఈ సెలవులు రోస్టర్ పట్టికలో ఉండవని పేర్కొన్నారు.
జూనియర్ డాక్టర్లతో తూతూ మంత్రంగా..
రోస్టర్ ప్రకారం సీనియర్, జూనియర్ డాక్టర్లకు డ్యూటీల వేస్తారు. కానీ పండగ రోజుల్లో సీనియర్ డాక్టర్లు ఎక్కడా కనిపించలేదని మృతుల బంధువులు ఆరోపించారు. కేవలం జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్షిప్ ట్రైనీలతో రోగులను ఈ పండగ రోజుల్లో నడిపించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఆసుపత్రిలో మరణాల సంఖ్య పెరిగిందని చెప్పారు.