ఉత్తరప్రదేశ్లోని ఖేడా గ్రామానికి చెందిన 62 ఏళ్ల షీలాదేవి... మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. వివాహం జరిగిన ఏడాదికే భర్తను కోల్పోయిన షీలాదేవి... తన పోషణ ఎవరికీ భారం కాకూడదని నిశ్చయించుకుంది. 22 ఏళ్లుగా సైకిల్పై ఊరూరా తిరుగుతూ పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు సైతం సాయం కోసం ఎవరినీ అర్థించకుండా మనోనిబ్బరంతో కష్టపడి పనిచేసుకుంటోంది. ఊరి ప్రజలంతా అభిమానంతో ఆమెను షీలా బువా అని పిలుచుకుంటారు.
ఎవరికీ భారం కాకూడదని..
షీలాదేవికి 1980లో వివాహమైంది. ఏడాదికే ఆమె భర్త మరణించాడు. అకస్మాత్తుగా వచ్చి పడిన కష్టంతో దిక్కుతోచని స్థితిలో.. ఖేడాలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది షీలా. ఎవరికీ భారంగా మారకూడదన్న ఉద్దేశంతో తండ్రికున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది.
"ఈ పని నా కాళ్లమీద నేను నిలబడిగేలా చేసింది. ఈ పనిద్వారానే నా బతుకు బండి నడుస్తోంది."
- షీలాదేవి
మరో ఏడాది తిరక్కుండానే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకుంది షీలాదేవి. ఒంటరిగా మిగిలిపోయానని తీవ్రంగా కుంగిపోయింది. కానీ... జీవితం ముందుకు సాగాల్సిందేనని తనకు తానే ధైర్యం చెప్పుకుని, బతుకుదెరువు కోసం కొన్ని గేదెలు కొనుగోలు చేసింది. పాలు విక్రయించడం మొదలుపెట్టింది. సైకిల్పైనే చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పాలు అమ్ముతుంది షీలా.
" ఉదయం నాలుగింటికే నిద్రలేస్తాను. గేదెలకు మేత వేసి, పాలు పితుకుతాను. ఇతరుల నుంచి కూడా పాలు కొనుగోలు చేసి, సైకిల్పై వెళ్లి, ఇంటింటికీ పాలు పోసి వస్తాను. నాకు 60 మంది వరకు వినియోగదారులున్నారు. మిగిలిపోయిన పాలను డెయిరీలో ఇస్తాను. ఒంటిగంట నుంచి నాలుగింటి వరకు పని ఉంటుంది. వండుకుని నాలుగు గంటలకు తింటాను. మళ్లీ ఐదింటికి పనికి వెళ్తాను. రోజూ ఏడున్నరకు నా పని పూర్తవుతుంది."
- షీలాదేవి