మహారాష్ట్ర ఠాణెలో దారుణం జరిగింది. పోలీసులమని బెదిరించి 17ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు. రేప్ చేస్తూ ఆ దారుణాన్ని వీడియో తీశారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం బాధితురాలు ఠక్రూలీ ఖాదీ బీచ్ ప్రాంతంలో తన ఫ్రెండ్తో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరికి వచ్చారు. తాము పోలీసులు అని చెప్పి.. బాధితురాలిని, ఆమె ఫ్రెండ్ను కొట్టారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకడు.. ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రెండో వ్యక్తి బాధితురాలి ఫ్రెండ్ను దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టాడు. మళ్లీ తిరిగొచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిందితుల చెర నుంచి బయటపడ్డ బాధితురాలు.. ఘటన గురించి కుటుంబ సభ్యులకు వెల్లడించింది. వారితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న విశూనగర్ పోలీసులు.. ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు. ఓ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో నిందితుల కదలికలు రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు. వాటి ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పండరినాథ్ భాలేరావ్ స్పష్టం చేశారు.