సైనికులని ధ్రువీకరించే ఎలాంటి అధికారిక గుర్తింపు పత్రం లేకుండా సంచరిస్తున్న 11మందిని అరెస్టు చేశారు పోలీసులు. అసోంలోని గువాహటిలో లోకప్రియ గోపీనాథ్ బర్దోలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు నలుగురు వ్యక్తులు ఆర్మీ దుస్తులు ధరించి అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆరా తీయగా.. వారు సైనిక సిబ్బంది కాదని అర్థమైంది. దీనికితోడు వారిచ్చిన సమాచారంతో.. ఆర్మీ దుస్తుల్లో తిరుగుతున్న మరో ఏడుగురినీ అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా పోలీసుల అదుపులో ఉన్న గోస్వామి.. మిగతా 10మందికి ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులుగా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లు తేలింది. వారితో పాటు గోస్వామి కూడా సెక్యూరిటీ అధికారిగా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అదుపులో ఉన్న 11 మంది ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు.. పలు రకాల డాక్యుమెంట్లు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.