Visakha Kailasagiri Hill Demolition : కైలాసగిరి కొండ ధ్వంసం.. పార్కింగ్ కోసమే అంటూ విమర్శలు..
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 1:25 PM IST
Visakha Kailasagiri Hill Demolition :విశాఖలో పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. మొన్నటి వరకు రుషికొండను ధ్వంసం చేసిన అధికారులు, ఇప్పుడు తెన్నేటి పార్కుకు ఎదురుగా ఉన్న కైలాసగిరి కొండ వెనుకభాగాన్ని జేసీబీలతో చదును చేస్తున్నారు. మొదట ఈ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్ కోసమే అధికారులు కేటాయించారు. కానీ, ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు షాపులను ఏర్పాటు చేయడం కోసమే కొండను ధ్వంసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విశాఖను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి, ఆ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. అటవీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, నోటిఫికేషన్లు జారీచేయకుండా, కైలాసగిరి కొండ విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) అధికారులు ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా అధికారులకు స్పందనలో ఫిర్యాదు చేశారు. భారీ వృక్షాలతో పచ్చగా ఉండే కైలాసగిరి కొండను ధ్వంసం చేయడం తక్షణమే నిలిపివేయాలని, లేకుంటే జనసేన పార్టీ నాయకులు పోరాటానికి సిద్ధమవుతారని ఆయన తెలిపారు .