TG VENKATESH: కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీపై కేంద్ర పెద్దల దృష్టి: టీజీ వెంకటేష్
రాజకీయంలో మొదటి, రెండో ప్రాధాన్యత స్థానంలో ఉన్న రాజకీయ పార్టీలకే ప్రజలు ఓట్లు వేస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలులో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మిగిలిన పార్టీలకు ఓట్లు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపరని అన్నారు. ప్రజల్లో బీజేపీపై అభిమానం ఉన్నా.. ఓట్ల రూపంలో వాటిని మార్చడంలో వెనుకబడిందని టీజీ వెంకటేష్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల అనంతరం మన రాష్ట్రంలో ప్రత్యేక దృష్టి ఉంచి ప్రజల దగ్గరికి బీజేపీని తీసుకుపోయేందుకు.. దిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
వైసీపీ, బీజేపీ మద్య మంచి సంబంధాలు ఉన్నా.. ముఖ్యమంత్రి విధానాల వల్ల రాష్ట్రంలో బీజేపీకి నష్టం జరుగుతుందని తెలిపారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా.. రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పుకుంటుందని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తే ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు దగ్గర అవుతాయని టీజీ వెంకటేష్ తెలిపారు.