Villagers Protest for Road: 'సీఎం శంకుస్థాపన చేసినా.. రహదారికి మోక్షం లేదు'
CM Jagan Laid Foundation Stone for Road but Forgot Works : వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులకు శంకుస్థాపనలు చేయడం, వాటి పనులు ప్రారంభించకపోవడం సర్వసాధారణం అయ్యింది. ఆ గ్రామస్థులు తమ ఊరి రోడ్డు నరకప్రాయంగా ఉందని చెప్పడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు చేయించడం మరచిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోడ్డు నిర్మాణానికి స్వయనా సీఎం జగన్ మోహన్ రెడ్డి గత సంవత్సరం శంకుస్థాపన చేశారు. ఇప్పటికి సంవత్సరం గడిచినా రహదారికి మోక్షం కలగలేదని ఆరోపిస్తూ డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ తన స్వగ్రామంలో పూర్తిగా గోతులమయమైన ముమ్మిడివరం - కాట్రేనికోన రహదారిని బాగు చేయించలేక పోయారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.