By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 9:59 PM IST
వీడేవడండి బాబూ - రాత్రికి రాత్రే రోడ్డు తవ్వేసి కంకర, మట్టి మాయం
Illegals Destroying Amaravati Roads: రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం యథేచ్చగా కొనసాగుతోంది. రాత్రికి రాత్రే రహదారులను మాయం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే బోరుపాలెం వద్ద మట్టి, కంకరను దొంగలు తవ్వుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా శాఖమూరు, ఐనవోలు గ్రామాల మధ్య గత ప్రభుత్వం నిర్మించిన రాజధాని రహదారిలో కంకర, గ్రావెల్ మట్టిని తరలించుకు పోయారు. హైకోర్టు వైపు నుంచి నీరుకొండ వరకు నిర్మించిన ఈ రహదారిలో ఆదివారం రాత్రి కొంత మంది ఆగంతుకులు మట్టిని, కంకరను అక్రమంగా తరలించుకుపోయారు.
పక్కనే ఉన్న ఎన్ 12 రహదారి జంక్షన్ వద్ద తారు రోడ్డును సైతం పగులగొట్టి దొంగలు కంకర మిశ్రమం, గ్రావెల్ను అపహరించారు. అక్రమంగా తరలించిన గ్రావెల్, కంకరను గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి వినియోగించి.. బిల్లులు వసూలు చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అయితే అమరావతిలో కేవలం రహదారుల విధ్వంసం మాత్రమే కాకుండా.. ఏది కనిపిస్తే దానిని దొంగలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారీ ఇనుప పైపులను సైతం కొద్ది కొద్దిగా కట్ చేసి తీసుకుని వెళ్లారు. వీటిన్నింటిపై సీఆర్డీఏ, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.