CM Jagan Review On PADA: పులివెందుల అభివృద్ది పనులపై సీఎం సమీక్ష..
CM Jagan Review On PADA : జలవనరుల శాఖ, వివిధ శాఖల పర్యవేక్షణలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, వైఎస్సార్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు.
ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె వద్ద రూ.1113 కోట్లతో చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణ పనుల తీరును అధికారులు వివరించారు. మరో రూ. 5036 కోట్లతో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జీఎన్ఎస్ఎస్కు లిఫ్ట్ స్కీం పనుల పురోగతిలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఒక్క రూ. 1256 కోట్లతో పులివెందుల నియోజకవర్గంలో సూక్ష్మసేద్యం పనులు చేపడుతున్నామని.. ఈ క్రమంలో 900 సంపుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని వెల్లడించారు.
కాలేటి వాగు రిజర్వాయర్కు సంబంధించి జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, సర్వరాయ సాగర్, వామికొండ సాగర్ డిస్ట్రిబ్యూటర్స్ కోసం భూసేకరణ కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నిర్దేశించిన గడువు లోపల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆక్విడెక్ట్, టన్నెల్, సబ్స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేసి, డిసెంబర్ నాటికి కాలేటి వాగులో సాగునీరు నింపాలని సీఎం ఆదేశించారు..