YSP leaders attacked Tehsildar : వైసీపీ నాయకుల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప వాటికి అంతం అనేది లేకుండా పోతోంది.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు.. బెదిరింపులే తాజాగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో తహశీల్దారుపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. తహశీల్దార్ కిషోర్కుమార్రెడ్డిని స్థానిక నాయకులు కార్యాలయం ముందే బెదిరించారు. అసైన్మెంట్ కమిటీలో తాము చెప్పిన వారికి భూములు కేటాయించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యాలయానికి వచ్చిన వైసీపీ నాయకులు, జడ్పీటీసీ రామ్గోవింద్రెడ్డి తహశీల్దార్తో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో తహశీల్దారు కార్యాలయం.. మరమ్మతుల కోసం విరాళం ఇవ్వాలని వైసీపీ నాయకులను తహశీల్దార్ కోరగా ఆయనను వైసీపీ నాయకులు దారుణంగా ధూషించారు. లంచాలు తీసుకుంటున్న అధికారులకు మళ్లీ విరాళం ఎందుకని ప్రశ్నించారు.
బి కోడూరు మండలంలో చేసినట్లు ఈ మండలంలో చేస్తే కుదరదని వైసీపీ జడ్పీటీసీ రామ్గోవిందరెడ్డి బ్రహ్మంగారిమఠం తహశీల్దార్ కిషోర్కుమార్రెడ్డిని హెచ్చరించారు. సహకార సంఘ కార్యాలయానికి స్థలం లేకుండా ప్రహరీ నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నీ ఆస్తి కాదు నీ ఇల్లు కాదు.. ఈ రోజు ఉంటావు రేపు వెళ్లిపోతావు.. కాని మేము వైసీపీ ఉన్ననాళ్లు ఉంటాం.. అంటూ జడ్పీటీసీ బెదిరింపులకు దిగారు. నువ్వు అధికారం చూపించడానికి ఇది ఏమీ బీ కోడూరు కాదు బ్రహ్మంగారిమఠం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మనోడు కాబట్టి ఉండనీ అనుకుంటున్నాం.. ప్రజలతో మంచిగా ఉండాలంటూ హితబోధ చేశారు. అసైన్మెంట్ భూముల కేటాయింపునకు తమ వర్గానికి చెందిన వారి పేర్లు నమోదు చేయక పోవడవంతో ప్రహరీ అంశాన్ని నాయకులు సాకుగా చూపి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అందరి ముందు బహిరంగంగా కార్యాలయం ఎదుట తహశీల్దార్ను బెదిరించడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. రెండు నెలల కిందటే ఈ మండలానికి వచ్చానని ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. జరిగిన ఘటనపై ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు తహశీల్దార్ కిషోర్కుమార్రెడ్డి తెలిపారు. తరువాత ఉన్నతాధికారులు ఎలా చెప్తే అలా వారి ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటానని తెలిపారు.