ఒంటిమిట్ట మండలంలో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని తెలిస్తే చాలు అక్రమార్కుల దురాక్రమణకు గురవుతోంది. వాగులు, వంక పోరంబోకు, కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా కబ్జాకు తెగబడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి హక్కులు లేకపోయినా అధికారులను మచ్చిక చేసుకుని కావాల్సినంత రాయించుకుని అనుభవిస్తున్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమించినట్లు అనువంశీకం, పిత్రార్జితం పేరిట రెవెన్యూశాఖ యంత్రాంగం నుంచి పత్రాలు పొందుతున్నారు. ఈ తతంగం గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నా ఎవరూ అడ్డుకోవడం లేదు సరికదా.. అక్రమమని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
మండలంలోని మంగంపేటలో నియోజకవర్గస్థాయిలోని ఓ ముఖ్య నేతకు చెందిన ప్రధాన అనుచరుడు అక్రమంగా అయిదెకరాలు కబ్జాకు పాల్పడ్డారు. ఇక్కడే మరో స్థానికేతర ముఖ్య నాయకుడి కుటుంబసభ్యులు, బంధువుల పేరిట 14.70 ఎకరాలను ఆక్రమించుకున్నారు. పెద్దల నుంచి సంక్రమించిన భూములు కాదు. వీరందరూ అధికారులను ప్రసన్నం చేసుకుని అడ్డదారిలో భూములను పొంది ఏకంగా బేరం పెట్టి సుమారు రూ.15 లక్షలకుపైగా సొమ్ము చేసుకున్నారు. ఇదంతా తమకేమి తెలియనట్లు అధికారులు ఉండడం విమర్శలకు తావిస్తోంది. కడప-రేణిగుంట జాతీయ రహదారి పక్కన సర్వే నంబరు 20లో 2.52 ఎకరాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని స్థానికంగా రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే చదును చేయగా, వివాదాస్పదం కావడంతో రెవెన్యూ అధికార యంత్రాంగం హెచ్చరిక సూచిక ఏర్పాటు చేయడంతో తాత్కాలికంగా ఆక్రమణలు నిలిచాయి.
ఒంటిమిట్ట మండలం మారుమూల గ్రామం పట్రపల్లి శివారులో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో సర్వే నంబరు 451లో 3.80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొంత మంది నాయకుల అండతో చెరువు పక్కనే రెండెకరాలకు పైగా ఆక్రమించారు. ఇక్కడ సాగిన భూ దందాపై అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగలేదు.
ఒంటిమిట్ట మండలం మంగంపేటలో కడప-రేణిగుంట జాతీయ రహదారికి అతి సమీపంలో సర్వే సంఖ్య 83లో 81 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇద్దరు కీలక ఉద్యోగుల కుటుంబ సభ్యులు భూ దందాకు తెరలేపారు. కొండలను పిండి చేసి గుట్టలను తొలగించి యంత్రాలతో చదును చేయించారు. నాలుగు ఎకరాలకుపైగా ఆక్రమించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి విస్తుపోయారు. పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అనంతరం బడా నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో చర్యలకు ఉపక్రమించలేదు. స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్ను సైతం అధికారులు వదిలేశారు.
జౌకులపల్లిని మింగేసిన అనకొండలు
మారుమూల గ్రామం జౌకులపల్లిలోని భూములను కొంతమంది నాయకులు మింగేశారు. భూమాఫియా చేతుల్లో ఎకరాలకొద్దీ ఉన్నా స్వాధీనంపై అధికారులు సాహసం చేయడం లేదు. ఇక్కడ దవళం దొరలు ఎక్కువగా పాగా వేశారు. గతంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సర్వే చేసి కబ్జా బాగోతాన్ని నిగ్గు తేల్చారు. చర్యలు తీసుకునే సమయంలో అధికారులపై బదిలీ వేటు పడింది. అటవీ శాఖకు చెందిన భూమి సైతం కబ్జాకు గురవ్వడమే కాకుండా పంటలు సైతం సాగవుతున్నాయి. రెవెన్యూశాఖ నుంచి అటవీశాఖకు బదలాయించిన 142.94 ఎకరాలు 33 మంది చేతుల్లో చిక్కుకోగా, రెవెన్యూ పరిధిలోని 82.65 ఎకరాలను 23 మంది హస్తగతం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన పెద్దలు ఆక్రమణదారుల జాబితాలో ఉండగా, అధికారులు కేవలం తాఖీదులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.