ఏళ్లు గడుస్తున్నా కడప జిల్లాలో జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇందుకు నిదర్శనం కృష్ణపట్నం పోర్టు ముంబై 67 జాతీయ రహదారి. కడప జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు ముంబై 67 జాతీయ రహదారిపై నిత్యం బద్వేల్ మీదుగా వందల వాహనాలు ముంబయి నుంచి కృష్ణపట్నానికి తిరుగుతుంటాయి. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్లే ఈ మార్గంలో పెద్దపోలుకుంట అడవి ప్రాంతంలో రహదారి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఓ పక్క రహదారి ఎత్తు ఉండటం , మరోపక్క తక్కువగా ఉండటం వల్ల వాహనచోదకులు గుర్తించలేక నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు.
ఇంత జరుగుతున్నా ఎన్హెచ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ రహదారి పనులు పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రహదారి ఎగుడుదిగుడు ఉండటం వల్ల ప్రయాణం సాగించడం కష్టంగా ఉంటుంది. దీంతో సమయం వృథా అవడంతో పాటు వాహనాలు దెబ్బతింటున్నాయి.