ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. హైదరాబాద్​కు బయలుదేరిన అవినాష్​రెడ్డి

Avinash Reddy started to Hyderabad: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నుంచి హైదరాబాద్​కు ఉదయం 5.20కి బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. వివేకా హత్య కేసులో సహనిందితుడిగా అవినాష్‌రెడ్డి పేరును సీబీఐ చేర్చిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

By

Published : Apr 17, 2023, 7:16 AM IST

YS Avinash Reddy
అవినాష్‌రెడ్డి

YS Avinash Reddy started to Hyderabad: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కావడానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెల్లవారుజామున పులివెందుల నుంచి బయలుదేరి వెళ్లారు. ఉదయం 5 గంటల 20 నిమిషాలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని ఆయన నివాసం నుంచి వాహనంలో బయలుదేరారు. ఆయన వెంట వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి కూడా హైదరాబాద్ పయనమయ్యారు.

ఆయన వాహనాన్ని అనుసరిస్తూ వైసీపీ నాయకులు భారీగా వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసు ఇచ్చిన నేపధ్యంలో అవినాష్ రెడ్డి హైదరాబాద్​కు బయలుదేరారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీబీఐ విచారణకు హాజరైయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ కేసులో నిన్ననే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, తాజాగా అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడంపై ఉత్కంఠ కలిగిస్తుంది.

సహనిందితుడిగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల జాబితాలో తాజాగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేరును సీబీఐ చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిని హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో నాలుగుసార్లు విచారించినప్పుడు సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేసింది. తాజాగా అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డిని ఆదివారం పులివెందులలో అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయమూర్తి నివాసంలో అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భాస్కర్​ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు.

హత్య తర్వాత సహనిందితులు డి.శివశంకర్‌రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి ఆధారాల్ని తుడిచిపెట్టేందుకు భాస్కరరెడ్డి కీలకపాత్ర పోషించారని అభియోగం మోపారు. దీంతో మొదటిసారిగా అవినాష్‌రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్లు తెలిసింది. పులివెందులలో ఉన్న ఆయనకు ఆదివారం సాయంత్రం సీబీఐ అధికారులు ఈ నోటీసులు జారీచేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్​లోని సీబీఐ కార్యాలయానికి.. విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు.

ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డికి రిమాండ్:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్​​రెడ్డి తండ్రి భాస్కర్​రెడ్డిని ఆదివారం ఉదయం పులివెందులలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో భాస్కర్‌ రెడ్డికి ఉస్మానియా వైద్యులు.. పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల్లో భాస్కర్‌ రెడ్డికి స్వల్పంగా రక్తపోటు పెరిగినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు ముగియడంతో సీబీఐ అధికారులు ఆయనను ఉస్మానియా హాస్పిటల్​ నుంచి సీబీఐ న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. భాస్కర్‌ రెడ్డికి 14 రోజుల (ఈనెల 29 వరకు) రిమాండ్ విధించారు. దీంతో అధికారులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details